
రాజకీయాల్లో జంపింగ్లు సర్వసాధారణం. అందులోనూ అధికారపార్టీ అందరినీ అయస్కాంతంలా లాగేస్తుంటుంది. ఎప్పుడెప్పుడు ఆ పార్టీలోకి జంప్ అవుదామా అని నేతలు తహతహలాడుతుంటారు. అయితే పార్లమెంటు ఎన్నికల ముందు పక్క పార్టీ నేతలను అక్కున చేర్చుకుంటోంది హస్తం పార్టీ. తాజాగా ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్లోకి రాష్ట్రవ్యాప్తంగా వలసలు కొనసాగుతున్నాయి. అలా వలస వచ్చే వాళ్లలో సొంత పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు కొందరైతే.. అధికారపార్టీ మీద మోజుతో వచ్చే వాళ్లు మరికొందరు. కారణం ఏదైనా వచ్చే నేతలను కలుపుకుని ముందుకుపోయే ఆలోచనలో ఉంది హస్తం పార్టీ. ఈ క్రమంలోనే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఢిల్లీలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు ఎంపీ వెంకటేష్. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. వెంకటేష్ను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఎంపీతోపాటు మరికొందరు బీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్లో చేరారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చెన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన వెంకటేష్ నేత.. అతర్వాత మారిన రాజకీయ పరిణామాలతో పెద్దపల్లి ఎంపీగా పోటీ విజయం సాధించారు. ప్రస్తుత పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎంపీగా వెంకటేష్ నేత కొనసాగుతున్నారు. ఇక, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, లోక్సభ ఎన్నికల వేళ సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడం బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..