Gussadi Kanaka Raju: గుస్సాడీ కళాకారుడు కనకరాజు కన్నుమూత.. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ప్రముఖ గుస్సాడీ నృత్యకళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. గిరిజన సంప్రదాయ కళారూపాన్ని కాపాడినందుకు ఆయనకు ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది.

Gussadi Kanaka Raju: గుస్సాడీ కళాకారుడు కనకరాజు కన్నుమూత.. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
Gussadi Dancer Kanaka Raju

Updated on: Oct 26, 2024 | 11:41 AM

పద్మశ్రీ గ్రహీత, ప్రముఖ గుస్సాడీ కళాకారుడు కనకరాజు కన్నుమూశారు.. వయోభారం, దీర్ఘకాలికి అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న గుస్సాడీ కళాకారుడు కనకరాజు శుక్రవారం (అక్టోబర్ 25) సాయంత్రం కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. గిరిజనుల సంప్రదాయ గుస్సాడీ నృత్యానికి జీవం పోసిన కనకరాజు మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు.

పద్మశ్రీ గ్రహీత, ప్రముఖ గుస్సాడీ కళాకారుడు కనకరాజు మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం. అధికారిక లాంఛనాలతో ఇవాళ అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్..


గుస్సాడీ కళాకారుడు కనకరాజు మృతి పట్ల భారత ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ప్రధాని మోదీ ట్వీట్..

పద్మశ్రీ ప్రదానం..

94 ఏళ్ల కనకరాజు.. గిరిజనుల సంప్రదాయ గుస్సాడీ నృత్యానికి జీవం పోసి, భావితరాలకు అందించారు. 55 సంవత్సరాలుగా గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించారు. ఆసక్తి చూపే వారికి శిక్షణ ఇస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శిస్తూ.. నేర్పుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన గుస్సాడీకి ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2021 నవంబరు 9న పద్మశ్రీ ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ప్రదానం చేసింది. ప్రాచీన నాట్యకళను పరిరక్షించడంతోపాటు.. నేర్పించడంలో కనకరాజు చేసిన కృషికి గానూ అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని గుస్సాడీ కళాకారుడు కనకరాజుకు అందజేశారు.

ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలం మర్లవాయికి చెందిన కనకరాజుకు ఇద్దరు భార్యలు, 12 మంది సంతానం. కనకరాజు మార్లవాయిలోని ఐటీడీఏ ఆశ్రమ స్కూల్​లో డైలీ వేజ్​వర్కర్​గా పని చేస్తూనే గుస్సాడీ డ్యాన్సులు చేసేవారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు.. ఆయన మృతిపట్ల పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us