
నల్లగొండ, జులై 20: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇతర పార్టీల నేతల చేరికలపై సందిగ్ధత కొనసాగుతుందా? ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్, బీజేపీలోని అసంతృప్తి నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? కోమటిరెడ్డి వ్యాఖ్యలతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం చేరికకు బ్రేక్ పడినట్లేనా? పార్టీలో కొత్త చేరికలు చిచ్చు పెడుతున్నాయా? ఇతర పార్టీల నేతల చేరికను దిగ్గజ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్లో ఏం జరుగుతోంది. ప్రత్యేక కథనం మీకోసం..
ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. వర్గ విభేదాలకు కేరాఫ్ అడ్రస్ నల్గొండ కాంగ్రెస్. కర్ణాటక ఎన్నికల ఫలితాల జోష్తో కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచారు. రాష్ట్ర కాంగ్రెస్ లో దిగ్గజ నాయకులంతా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే. దిగ్గజ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి చేతుల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు మూడు నియోజకవర్గాల చొప్పున ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో సీనియర్ నేతలకు గట్టిపట్టు ఉంది. ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులు ఉన్నారని, కొత్తగా చేరే వారితో లాభం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కోదాడ బీఆరెస్ నేత కన్మంత రెడ్డి శశిధర్రెడ్డిలు పార్టీలో అసంతృప్తితో ఉన్నారు. నకిరేకల్ నుంచి 2014లో వేముల వీరేశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అప్పటినుంచి ఇరువర్గాల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. తనకు టికెట్ దక్కుతుందో లేదోనన్న అనుమానంతో వేముల వీరేశం కాంగ్రెస్ వైపు చూస్తున్నారట. రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన కొందరు నేతలు వేముల వీరేశంతో చేరికపై అంతర్గతంగా చర్చించారట. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో పట్టు ఉంది. వేముల వీరేశం చేరికను ఎంపీ కోమటిరెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
మరో వైపు కోదాడ నుంచి 2014లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. ఈ సారి ఎన్నికల్లో పోటీకి పద్మావతి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక నేతలపై రేవంత్ ఎన్నికల టీమ్ సర్వే నిర్వహించిందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కోదాడ బీఆరెస్ నేత కన్మంత రెడ్డి శశిధర్రెడ్డి కాంగ్రెస్లో చేరికకు రేవంత్ టీమ్ చర్చించారట. కోదాడలో ఇతర పార్టీల నేతల చేరికను ఉత్తమ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
సూర్యాపేట నియోజక వర్గానికి చెందిన కొందరు నేతలు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం కొత్త చిచ్చుకు దారితీస్తోందట. తాను ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గంలో తనకు కనీస సమాచారం లేకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారని మాజీ మంత్రి దామోదర్రెడ్డి చేరికల కమిటీ ఛైర్మన్ అయిన జానారెడ్డి, స్థానిక ఎంపీ ఉత్తమ్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు సైతం చేరికలపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట.
జిల్లాలోని12అసెంబ్లీ సీట్లలోనూ పార్టీకి అభ్యర్థులున్నారని, పార్టీ ఓవర్ లోడైందని, కొత్తగా ఇతర పార్టీల నుండి చేరికలు అవసరం లేదంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. అనుచరులు ఉన్న నియోజక వర్గాల్లో తమ అధిపత్యానికి గండి పడుతుందనే సీనియర్ నేతలు.. ఇతర పార్టీల నేతల చేరికను వ్యతిరేకిస్తున్నారని పార్టీలో టాక్.
సీనియర్ నేతల వ్యవహార శైలితో కాంగ్రెస్లో చేరికకు వెనుకడుగు వేస్తున్నారట నేరుగా పార్టీ హైకమాండ్తో టచ్లో ఉండి చేరితే రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయనే భావనలో ఉన్నారట. ప్రస్తుత పార్టీలో అసంతృప్తి ఉన్నా.. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే ఉమ్మడి జిల్లాలో లెక్కకు మిక్కిలి గ్రూప్లున్నాయి. వారందరినీ కలిసి పార్టీలో చేరే బదులు ఈ పార్టీలోనే వైరివర్గంతో కలిసిపోవడం బెటర్ అనుకుంటున్నారట. టిక్కెట్పై ఒకరు హామీ ఇచ్చినా వేరొకరు ఢిల్లీ నుంచైనా ఆపుతారు. అందుకే ఆ పార్టీలో చేరికపై ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారట.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..