Munugode Bypoll: ‘బీఆర్ఎస్’కు పునాది వేసే అవకాశం మునుగోడు ప్రజలదే.. నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి..
చండూరు సభా వేదికగా.. భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు, విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ, నేటి తెలంగాణను కంపేర్ చేస్తూ.. భారతదేశం కూడా ఇలా ..
చండూరు సభా వేదికగా.. భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు, విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ, నేటి తెలంగాణను కంపేర్ చేస్తూ.. భారతదేశం కూడా ఇలా అభివృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ మాదిరిగానే భారతదేశాన్ని కూడా తయారు చేయాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ పుట్టుకొచ్చిందన్నారు. బీఆర్ఎస్ పుట్టుక.. మునుగోడు ప్రజలకు గొప్ప అవకాశంగా పేర్కొన్నారు సీఎం. చరిత్రలో సువర్ణావకాశం మునుగోడు ప్రజలకే దక్కిందన్నారు. ఈ ఉప ఎన్నిక ద్వారా బీఆర్ఎస్ పార్టీకి భారతదేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పడానికి పునాది రాయి పెట్టే అవకాశం మునుగోడు ప్రజలకే దక్కిందన్నారు ముఖ్యమంత్రి.
‘ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ ఏలా ఉండేది. కరెంట్ ఏ సమయానికి వస్తుండేది. మంచినీళ్ల పరిస్థితి ఎలా ఉండేది. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ పచ్చబడింది. మొఖం తెల్లబడ్డది. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదలను ఆదుకుంటున్నాం. తెలంగాణ మాదిరిగానే భారతదేశాన్ని తయారు చేయాలని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పుట్టుకొస్తుంది. మునుగోడు ప్రజలకు ఇది గొప్ప అవకాశం. వామపక్ష కార్యకర్తలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి. చరిత్రలో సువర్ణావకాశం మునుగోడుకే దక్కింది ఈ ఉపఎన్నిక ద్వారా. బీఆర్ఎస్ పార్టీకి భారతదేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పడానికి పునాది రాయి పెట్టే అవకాశం మునుగోడు ప్రజలకే దక్కింది. ఆనాడు తెలంగాణ కోసం సిద్ధిపేట నుంచి బయలుదేరుతా అంటే.. సిద్దిపేట బిడ్డలు అక్కడ వచ్చిన ఉపఎన్నికలో మెజార్టీ ఓట్లతో సద్దిగట్టి.. నన్ను తెలంగాణ పోరాటానికి పంపించారు. మునుగోడు ప్రజలకు నా విజ్ఞప్తి. ప్రభాకర్ రెడ్డిని గెలిపించే రూపంలో కేసీఆర్కు మీరు ఎంత పెద్ద సద్ది కడుతారో.. అంతపెద్ద విజయం భారతదేశానికి వస్తుంది. ఈ దేశమే బాగుపడుతుంది. కేసీఆర్ ఎంత పెద్దగా పెరిగినా.. బీఆర్ఎస్ పునాది రాయి మునుగోడే కాబోతది. అందుకే మునుగోడును ఎప్పుడూ నా గుండెల్లో పెట్టుకుంటా. మీకు అన్ని రకాలుగా అండదండగా ఉంటాను. నీళ్లు రావాలి. కరెంట్ రావాలి. దేశం బాగు కోసం జరిగే పోరాటంలో మునుగోడు ప్రజలు భాగస్వాములు కావాలి. ఉప ఎన్నిక ద్వారా పునాదిరాయి బలంగా వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..