AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాదాద్రి ప్రధాన ఆలయం పనులు దాదాపు పూర్తి.. ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం తొందరలో ప్రారంభోత్సవం -మంత్రి వేముల

యాదాద్రి పనుల పురోగతిని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులతో కలిసి..

యాదాద్రి ప్రధాన ఆలయం పనులు దాదాపు పూర్తి.. ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం తొందరలో ప్రారంభోత్సవం -మంత్రి వేముల
K Sammaiah
|

Updated on: Jan 27, 2021 | 6:56 PM

Share

యాదాద్రి పనుల పురోగతిని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. పుష్కరిణి, కళ్యాణ కట్ట పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పుష్కరిణికి ఇరువైపులా పురుషులకు, స్త్రీలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ ఉండేలా చూడాలన్నారు. కళ్యాణకట్ట వద్ద బాత్రూంలను పరిశీలించారు. ఫినిషింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్లాబ్స్,ఫ్లోరింగ్ పని వివరాలు, ఏ రోజు ఏ పని పూర్తి ఐటమ్ వైజ్ నివేదికను అందజేయాలని యాదాద్రి ఎస్.ఈ వసంత్ నాయక్ ను ఆదేశించారు.

అనంతరం రింగ్ రోడ్డు పనులు,ప్రధాన ఆలయానికి వెళ్లే దారిని మంత్రి పరిశీలించారు.పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రెసిడెన్షియల్ సూట్,విఐపి కాటేజీల నిర్మాణ పనులను పరిశీలించారు. దాదాపు 90 శాతం పూర్తయిన పనులు తొందరలో పూర్తి చేయాలన్నారు. అనంతరం ప్రధాన ఆలయం పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని ఆయన ఆలోచన రీతిలో ప్రపంచం అబ్బురపడేలా ఆలయాన్ని నిర్మించారని ఆలయ ప్రాంగణంలో అధికారులతో కలియతిరిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఇంతటి గొప్ప బృహత్తర కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను భాగస్వామ్యం చేయడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.

భూమి మీదనే ఏడు గోపురాలతో నిర్మించిన ఆలయం మరెక్కడా లేదని, చరిత్రలో నిలిచే గొప్ప ఆలయం యాదాద్రి అని స్థపతులు మంత్రి తో చెప్పారు. ముఖ్యమంత్రి ఆధ్యాత్మికతకు, అకుంఠిత దీక్షకు నిదర్శనం ఈ అలయమని మంత్రి వారితో అన్నారు. రానున్న రోజుల్లో ఆధ్యాత్మిక శోభతో, భక్తులతో యాదాద్రి అంతా ఫరిడవిల్లుతుందని మంత్రి ఆనందం వెలిబుచ్చారు. అనంతరం ఆలయ అధికారుల ఆహ్వానం మేరకు ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల చేతుల మీదుగా తీర్థ ప్రసాదాలు స్వీకరించి, ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, సివిల్ సప్లై చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సీఎంఓ అధికారి భూపాల్ రెడ్డి ,ఆర్ అండ్ బి శాఖ ఈఎన్సీలు గణపతి రెడ్డి ,రవీందర్ రావు, యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్,వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు,పలువురు అధికారులు పాల్గొన్నారు.