
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల టూర్లో భాగంగా మంత్రి ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. ఈ టూర్లో భాగంగా కేటీఆర్.. హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అమిత్షాతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. హైదరాబాద్లోని కంటోన్మెంట్లో స్కైవేల నిర్మాణంపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిపారు. తొమ్మిదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి నయా పైసా సాయం చేయడంలేదని విమర్శించారు. జేబీఎస్ నుంచి రాజీవ్ రహదారిలో స్కైవే నిర్మాణానికి 96 ఎకరాల కంటోన్మెంట్కు చెందిన భూమి ఇవ్వాలని అడిగినట్లు తెలిపారు. ల్యాండ్ ఫర్ ల్యాండ్ కూడా ఇస్తామని కేంద్ర మంత్రితో తెలిపినట్లు పేర్కొన్నారు.
ఇక హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తొమ్మిదేళ్ల నుంచి అడిగినా.. కనీసం స్పందించడంలేదని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయత్న లోపం లేకుండా ఢిల్లీకి తిరుగుతున్నామన్నారు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..