Ambedkar Statue: హుస్సేన్సాగర్ ఒడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం.. డెడ్లైన్ ఫిక్స్ చేసిన తెలంగాణ సర్కార్
హైదరాబాద్ మహా నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో రూ.100 కోట్ల వ్యయంతో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Ambedkar Statue at Hussain Sagar: రాష్ట్రంలోని దళితులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న తెలంగాణ ప్రభుత్వం.. బృహత్తర ప్రాజెక్టుకు త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది. హైదరాబాద్ మహా నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో రూ.100 కోట్ల వ్యయంతో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహం 11 ఎకరాల విస్తీర్ణణంలో 125 అడుగుల ఎత్తుతో పిలవాలని టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పనులను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం పరిశీలించారు.
ఈ అంబేద్కర్ మహా విగ్రహం ఏర్పాటు పనులకు సంబంధించిన వివరాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాకు తెలిపారు. ఈ విగ్రహం కిందిభాగంలో 50 అడుగుల మేర పార్లమెంటు ఆకృతిలో ఓ భవంతి ఉంటుందని, దానిపైన విగ్రహ నిర్మాణం ఉంటుందని వివరించారు. గరిష్ఠంగా 15 నెలల కాలంలో ఈ విగ్రహం నిర్మాణం పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అంబేద్కర్ గొప్పదనాన్ని ప్రతిబింబించేలా విగ్రహ నిర్మాణం ఉంటుందని ఆయన వివరించారు. సువిశాలమైన స్థలంలో అంబేద్కర్ పార్కును నిర్మించబోతోంది తెలంగాణ సర్కార్. విగ్రహంతో పాటు మ్యూజియం, లైబ్రరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. విగ్రహం వెడల్పు 45.5 ఫీట్లు ఉంటుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు.
గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నది ఒడ్డున ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తర్వాత దేశంలో ఇదే ఎత్తైన విగ్రహాం కానుంది. ఈ ప్రాంతంలో ధ్యానమందిరం, సమావేశ మందిరం, లేజర్ షో, క్యాంటీన్,సువిశాలమైన పార్కింగ్ ,వాష్ రూంలు నిర్మిస్తామని మంత్రి తెలిపారు. అలాగే, ఇక్కడ స్కిల్స్ డెవలప్ మెంట్ వర్క్ షాపులు, సెమినార్లు జరుగుతాయన్నారు. దీనిని పచ్చదనంతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆకర్షణీయంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇది రాష్ట్రంలోనే ముఖ్య పర్యాటక ప్రదేశంగా వెలుగొందనుందని, దీనిని పటిష్టంగా, పకడ్బంధీగా నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి వివరించారు.
అయితే, పలు పరీక్షలు, డిజైన్ ఖరారు, సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున కొంత అలస్యమైందన్న మంత్రి, చైనా, సింగపూర్ లలో ఇటువంటి భారీ విగ్రహాలను పరిశీలించామని,ఈ కారణాల వల్ల కొంత ఆలస్యం జరిగిందన్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అన్నివర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని ఇనుమడించే విధంగా, నగరానికి మరింత వన్నె తెచ్చే విధంగా దీని నిర్మాణం ఉంటుందన్నారు. కేసిఆర్ దీనిని త్వరితగతిన పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారన్న కొప్పుల.. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును 12 నెలల నుంచి 15నెలల్లో పూర్తి చేయాల్సిందిగా మంత్రి ఆదేశించారు.