మంచిర్యాల SBI బ్యాంకులో భారీ కుంభకోణం.. ఏకంగా రూ.13 కోట్లు కాజేసిన సిబ్బంది! 44 మంది అరెస్ట్..
ఎస్బీఐ బ్రాంచ్ 2లో 402 మంది ఖాతాదారులకు చెందిన 20.496 కిలోగ్రాముల బంగారు ఆభరణాలు మాయమైనట్టు ఇటీవల జరిగిన ఆడిట్లో తేలింది. ఈ బంగారం విలువ రూ.12.61 కోట్లు. అంతేకాకుండా రూ.1.10 కోట్ల నగదు కూడా ఆగమైంది. దీంతో మొత్తం మోసం రూ.13.71 కోట్లకు చేరింది. క్యాషియర్ రవీందర్ ఈ మోసాన్ని చివరి 10 నెలల్లో విడతలవారీగా..

మంచిర్యాల, ఆగస్ట్ 31: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్ 2లో జరిగిన భారీ మోసం స్థానికంగా సంచలనం సృష్టించింది. బ్రాంక్ క్యాషియర్గా పనిచేస్తున్న నరిగె రవీందర్ అనే వ్యక్తి ఏకంగా రూ.13 కోట్లకు పైగా బంగారు ఆభరణాలు, రూ.1.1 కోట్ల నగదు కాజేసి పరారయ్యాడు. ఆగస్టు 22న జరిగిన అంతర్గత ఆడిట్లో ఈ విషయం తేటతెల్లమైంది. ఇది జిల్లాలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద బ్యాంకు దోపిడీల్లో ఒకటిగా నిలిచింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో చెన్నూరు పట్టణంలో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఎస్బీఐ బ్రాంచ్ 2లో 402 మంది ఖాతాదారులకు చెందిన 20.496 కిలోగ్రాముల బంగారు ఆభరణాలు మాయమైనట్టు ఇటీవల జరిగిన ఆడిట్లో తేలింది. ఈ బంగారం విలువ రూ.12.61 కోట్లు. అంతేకాకుండా రూ.1.10 కోట్ల నగదు కూడా ఆగమైంది. దీంతో మొత్తం మోసం రూ.13.71 కోట్లకు చేరింది. క్యాషియర్ రవీందర్ ఈ మోసాన్ని చివరి 10 నెలల్లో విడతలవారీగా చేపట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఖాతాదారులు బంగారం లోన్ల కోసం ఇచ్చిన ఆభరణాలు, నగదు డిపాజిట్లను రవీందర్ బ్యాంకు రికార్డుల్లో సరిగ్గా చూపించినా.. గుట్టుచప్పుడుకాకుండా వాటిని తన జేబులోకి మళ్లించుకున్నాడు. ఆ ఆభరణాలను వేరే ప్రైవేటు బ్యాంకుల్లో మళ్లీ తాకట్టు పెట్టి, డబ్బులు దారి మల్లించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇలా రోజువారీగా కొంచెం, కొంచెం బంగారు తీసుకెళ్లడం వల్ల ఎవరికీ అనుమానం కలగలేదని పోలీసులు చెబుతున్నారు.
రవీందర్ జైపూర్ మండల్లోని శెట్ పెల్లి గ్రామానికి చెందినవాడు. బ్రాంచ్లో క్యాషియర్గా పనిచేస్తూ, ఖాతాదారుల నమ్మకాన్ని దుర్వినియోగం చేశాడు. ఆడిట్ ప్రారంభమైన ఆగస్టు 22నే అతడు ఫోన్ను ఆఫ్ చేసి, పరారయ్యాడు. చెన్నూరు పోలీస్ స్టేషన్లో బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేసిన అనంతరం తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం తొమ్మిది మంది నిందితులపై కేసు దాఖలైంది. ఇందులో రవీందర్ ప్రధాన నిందితుడు. రామగుండం కమిషనర్ ఆంబర్ కిషోర్ ఝా, పోలీస్ బృందాలు సీసీటీవీ ఫుటేజ్లు, ట్రాన్సాక్షన్ లాగ్లు, ఫింగర్ప్రింట్ ట్రైల్స్ను సేకరించించారు. చెన్నూరు పట్టణంలోని చాలా మంది రైతులు, చిన్న వ్యాపారులు ఈ బ్రాంచ్లో బంగారం లోన్లు తీసుకున్నారు.
మా బంగారం ఎక్కడిపోయింది?, మా డబ్బులు తిరిగి వస్తాయా?, ఎంతకాలంగా ఈ మోసం జరిగింది?, ఇంకా ఎంత మోసం జరిగి ఉండవచ్చు? అని భాదితులు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బ్యాంకింగ్ వ్యవస్థలో భద్రతా లోపాలను బయటపెట్టింది. తాజా ఘటనతో ఎందుకు ఇంతకాలం ఎవరికీ అనుమానం కలగలేదు? రోజువారీ ట్రాన్సాక్షన్లలో చెక్లు ఎందుకు లేవు? అనే ప్రశ్నలు లేవనెత్తాయి. వారం రోజుల పాటు వివిధ కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు ఎట్టకేలకు రామగుండం కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న నరిగె రవీందర్ తో పాటు మరో 44 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిలో ముగ్గురు ప్రధాన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన క్యాషియర్ రవీందర్తోపాటు బ్యాంక్ మేనేజర్, మరో 8 మంది సిబ్బంది ఉన్నట్లు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు.
వారి వద్ద నుండి15.237 కిలోల బంగారు ఆభరణాలు, రూ. లక్ష 22 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ తతంగం నడిపినట్లు కమిషన్ చెప్పారు. అనంతరం కేసు నమోదు చేసి నిందితులను కటకటాల్లోకి పంపించినట్లు ఆయన వివరించారు. ఈ వ్యవహారంలో మరింత లోతుగా విశ్లేషణ చేసి ఎంతటి వారున్న వదిలేదేది లేదని, శాఖ పరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కేసు పురోగతిలో కీలకపాత్ర పోషించిన పోలీసులకు నగదు పురస్కారం అందచేసి కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.








