టోల్ ప్లాజా వద్ద ఆగిన కారు.. 20 కి.మీ. వెళ్లాక కుటుంబానికి గుండె ఆగిపోయే షాక్! అసలు ఏం జరిగిందంటే?
Khammam news: టోల్ ప్లాజా వద్ద కారు దిగిన బాలుడిని గమనించకుండానే కుటుంబం 20 కిలోమీటర్లు వెళ్లిపోయింది. కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇంతలో రోడ్డుపక్కన ఒంటరిగా ఉన్న బాలుడిని గుర్తించిన ముగ్గురు యువకులు పోలీసులకు అప్పగించడంతో సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరాడు.

అచ్చం సినీ పక్కీలా జరిగింది. తల్లిదండ్రులకు గుండె ఆగినంత పని అయ్యింది. కానీ, వారి అదృష్టం బాగుండి మానవతా దృక్పథంతో కొందరు యువకులు చేసిన సాయానికి ఊపిరిపీల్చుకున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గౌరారం గ్రామంలో టోల్ ప్లాజా వద్ద తప్పిపోయిన బాలుడిని అక్కడి యువకులు.. తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన చోటు చేసుకుంది.
కొత్తగూడెంకు చెందిన షేక్ గని సాహెబ్ ముగ్గురు పిల్లలు, భార్యతో కలిసి శనివారం తన కారులో గుంటూరుకు వెళ్తూ వాటర్ బాటిల్ కోసం పెనుబల్లి మండలం గోరారం టోల్ ప్లాజా వద్ద కారు ఆపాడు. ఇదే సమయంలో అతని కుమారుడు అమాన్.. కారు దిగి పక్క దుకాణానికి వెళ్లాడు. కుమారుడు దిగిన సంగతి చూసుకోకుండా కారులో విజయవాడ వైపు కుటుంబంతో కారులో వెళ్లారు. 20 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత మార్గ మధ్యలో కుమారుడు అమాన్ కనిపించకపోవడంతో వారి గుండె ఆగినంత పని అయ్యింది. అసలు ఏమి జరిగిందో తెలియక.. వచ్చిన రూట్లోనే అతను వెనుదిరిగారు.
అయితే, కారు దిగిన బాలుడు అమాన్.. రోడ్డు పక్కన బిక్కు బిక్కుమంటూ ఉండటం చూసిన అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటకు చెందిన నంద్యాల వెంకట్రావ్, పోతురాజు ప్రదీప్, తోటి సలీమ్ అనే యువకులు.. ఆ బాలుడిని VM బంజర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు బాలుడి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకొని వారికి సమాచారం అందించారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన తల్లితండ్రులకు పోలీసులు ఆ బాలుడిని అప్పగించారు. దీంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. ఆ యువకుల మంచి మనసుతో సాయం చేశారు. వేరే ఆలోచన ఉండి ఉంటే.. ఊహించడం కష్టమే. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.
వీడియో చూడండి..
