KCR: ప్రభుత్వ మెడలు వంచి నిధులు విడుదల చేపిస్తా.. చేవెళ్ళ సభలో నిప్పులు చెరిగిన కేసీఆర్
ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపించడం లేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కొన్ని ప్రలోభాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోగానే కరెంటు, సాగునీరు, తాగునీరు లేకుండా పోయాయన్నారు. చేవెళ్లలో లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించారు గులాబీ బాస్ కేసీఆర్.
![KCR: ప్రభుత్వ మెడలు వంచి నిధులు విడుదల చేపిస్తా.. చేవెళ్ళ సభలో నిప్పులు చెరిగిన కేసీఆర్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/04/kcr-chevella.jpg?w=1280)
ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపించడం లేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కొన్ని ప్రలోభాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోగానే కరెంటు, సాగునీరు, తాగునీరు లేకుండా పోయాయన్నారు. చేవెళ్లలో లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించారు గులాబీ బాస్ కేసీఆర్, కాంగ్రెస్, బీజేపీపై ఘాటుగా విమర్శలు చేశారు.ప్రజల్లో మత పిచ్చి పెట్టి ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోందని కేసీఆర్ విమర్శించారు. ప్రజల్లో భావోద్వేగాలతో ఓట్లు దండుకోవడం తప్పా, పదేళ్ళలో చేసిన మంచి పని ఒకటి లేదన్నారు. మోదీ.. తప్పితే ఈడీ.. ఇదేనా బీజేపీ రాజకీయం..? అని కేసీఆర్ నిలదీశారు.
420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పారన్నారు కేసీఆర్. స్కూటీలు ఇవ్వకపోగా తెలంగాణలో లూటీలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. తాను పక్కకు పోగానే కరెంటు ఎందుకు మాయమైందని ప్రశ్నించారు కేసీఆర్. ఇది అధికార కాంగ్రెస్ అసమర్థత అన్నారు. రూ. 12 లక్షల దళిత బంధు ఇస్తామన్న కాంగ్రెస్…ఒక్కళ్లకు కూడా ఇవ్వలేదని ఆరోపించారు కేసీఆర్. ప్రొసిడింగ్ అయిన ఒక లక్ష 30 వేల మందికి దళిత బంధు ఇవ్వకుంటే.. వాళ్లందరితో సెక్రటేరియట్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఆ నిధులు విడుదల చేపిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.
పనిలో పనిగా చేవెళ్ళ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. రంజిత్ రెడ్డి ఎందుకు పార్టీ మార్చిండో జనం గమనిస్తున్నారన్నారు. ఆయనేమన్నా పొద్దుతిరుగుడు పువ్వా..! పొద్దుతిరుగుడు పూవు లెక్క..! ఎటు అధికారం ఉంటే అటు తిరుగుతారా..! ఇలాంటి పొద్దుతిరుగుడు పూలకు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం నేర్పండి అంటూ పిలుపునిచ్చారు కేసీఆర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…