
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత తొలిసారి విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని శుక్రవారం విచారించింది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుకు సంబంధించి మార్చి 23న 77 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఏసీబీ.. అందులో కేటీఆర్తో సహా మరో ఐదుగురు అధికారులపై అభియోగాలు మోపింది. ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు పంపింది.
నోటీసులు అందుకున్న వారిలో మాజీ మంత్రి కేటీఆర్తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్. రెడ్డి తదితరులు ఉన్నారు. కోర్టు నోటీసుల మేరకు శుక్రవారం మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం రూ. లక్ష పూచీకత్తుతో పాటు, రెండు షూరిటీలు సమర్పించాలని కేటీఆర్ను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. కోర్టు విచారణ అనంతరం ఎమ్మెల్యే కేటీఆర్ నేరుగా అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నర్సంపేటకు బయలుదేరారు.
గత బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు చెందిన ఫార్ములా-ఈ ఆర్గనైజేషన్ (FEO)కు రూ. 55 కోట్లు మళ్లించారనే ఆరోపణలు రావడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. సుమారు 15 నెలల పాటు ఈ కేసుపై దర్యాప్తు జరిపిన ఏసీబీ, 2026 మార్చిలో కోర్టులో 77 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లో ఏసీబీ కేటీఆర్తో పాటు ఎంఏయూడీ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్. రెడ్డి, ఎఫ్ఈఓ ప్రతినిధి ఆల్బెర్టో లాంగో, ఏస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్ కిరణ్ రావులపై అభియోగాలు మోపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.