AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి విమర్శలు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ, దేశ ప్రజలకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి విమర్శలు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
Kishan Reddy Rahul Gandhi
Ram Naramaneni
|

Updated on: Jul 30, 2026 | 7:00 AM

Share

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ పలుమార్లు ‘ఇడియట్’ వంటి పదాన్ని ఉపయోగించడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు.

ఇటీవలి విద్యార్థుల ఆందోళనలను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం విఫలమైన నేపథ్యంలో, రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆధారరహిత విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోలేకపోవడం, వరుస ఎన్నికల పరాజయాలను జీర్ణించుకోలేకపోవడం వల్లే కాంగ్రెస్ నాయకత్వం వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేశారని కిషన్ రెడ్డి తెలిపారు. విద్యార్థులతో వారికి అర్థమయ్యే రీతిలో సంభాషించి ఆందోళనను శాంతియుతంగా ముగించేందుకు సహకరించారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలను వాస్తవాలతో ఎదుర్కోలేక కాంగ్రెస్ వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని ఆయన ఆరోపించారు.

ప్రధానమంత్రిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అంటే ప్రజాస్వామ్య తీర్పును అవమానించడమేనని కిషన్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ దేశ ప్రజలకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

దేశ రాజకీయాలు ప్రజా సమస్యలు, అభివృద్ధి, పాలన, విధానాలపై నిర్మాణాత్మక చర్చల చుట్టూ సాగాలని, వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలకు తావు ఉండకూడదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నాయకత్వం ఈ తరహా రాజకీయాలకు స్వస్తి చెప్పాలని ఆయన సూచించారు.

Follow Us