వందే భారత్ డ్రైవర్ కావాలంటే ఏం చేయాలి? జీతం, అర్హతలు ఏమేం కావాలో పూర్తి వివరాలు
How to Become Vande Bharat Loco Pilot: వందే భారత్ ఎక్స్ప్రెస్ను నడిపే లోకో పైలట్గా నేరుగా చేరే అవకాశం ఉండదు. ముందుగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)గా ఎంపికై అనుభవం సంపాదించాలి. అనంతరం ప్రత్యేక శిక్షణ, నైపుణ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లను నడిపే అవకాశం లభిస్తుంది..

భారతీయ రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సెమీ హైస్పీడ్ రైళ్లలో ఒకటైన వందే భారత్ ఎక్స్ప్రెస్పై ప్రయాణికుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల ఢిల్లీ-హిమాచల్ ప్రదేశ్ మార్గంలోని వందే భారత్కు నంగల్ డ్యామ్ స్టేషన్లో ప్రయోగాత్మకంగా హాల్ట్ ఏర్పాటు చేయడం, అలాగే ముంబై-నాందేడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఓవర్హెడ్ ఎక్విప్మెంట్ (OHE) లోపం కారణంగా ఆలస్యం కావడం వంటి అంశాలు వార్తల్లో నిలిచాయి. ఈ నేపథ్యంలో వందే భారత్ రైలును నడిపించే లోకో పైలట్లు ఎవరు? వారికి ఎలా ఉద్యోగం వస్తుంది? వారి అర్హతలు ఏమిటి? జీతం ఎంత? అనే విషయాలపై ఆసక్తి పెరిగింది.
వందే భారత్ లోకో పైలట్గా నేరుగా ఉద్యోగం పొందొచ్చా?
వందే భారత్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ పోస్టుకు నేరుగా దరఖాస్తు చేసే అవకాశం లేదు. భారతీయ రైల్వే నేరుగా వందే భారత్ కోసం లోకో పైలట్లను నియమించదు. ముందుగా అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నిర్వహించే నియామక ప్రక్రియ ద్వారా ‘అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)’గా ఉద్యోగం పొందాలి. ALPగా పనిచేస్తూ రైళ్లను నడపడంలో అనుభవం సంపాదించాలి. మంచి భద్రతా రికార్డు, పనితీరు ఉన్న లోకో పైలట్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాతే వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లను నడిపించే అవకాశం లభిస్తుంది.
వందే భారత్ లోకో పైలట్ కావడానికి ఏయే అర్హతలు ఉండాలంటే..?
అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి. వయస్సు సాధారణంగా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అదనంగా భారతీయ రైల్వే నిర్దేశించిన వైద్య ప్రమాణాలు, కంటి చూపు పరీక్షల్లో అర్హత సాధించాలి. లోకో పైలట్ జీతం వారి హోదా, అనుభవం, డ్యూటీ గంటలు, అలవెన్సులపై ఆధారపడి ఉంటుంది. అసిస్టెంట్ లోకో పైలట్ ప్రారంభ ప్రాథమిక వేతనం సుమారు రూ.19,900, అలవెన్సులు కలిపితే నెలకు సుమారు రూ.35,000 నుంచి రూ.40,000 వరకు అందుతుంది. అనుభవం ఉన్న లోకో పైలట్లు, ముఖ్యంగా వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లకు నియమితులైన వారు నెలకు రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది.
లోకో పైలట్లకు లభించే ఇతర ప్రయోజనాలు
జీతంతో పాటు భారతీయ రైల్వే ఉద్యోగులకు అనేక సదుపాయాలు లభిస్తాయి. అవేంటంటే..
- డియర్నెస్ అలవెన్స్ (DA)
- హౌస్ రెంట్ అలవెన్స్ (HRA)
- ట్రాన్స్పోర్ట్ అలవెన్స్
- రన్నింగ్ అలవెన్స్
- నైట్ డ్యూటీ అలవెన్స్
- వైద్య సదుపాయాలు
- పెన్షన్ ప్రయోజనాలు
- రైల్వే ప్రయాణ రాయితీలు
- చెల్లింపు సెలవులు
- ఉద్యోగ భద్రత
- పదోన్నతి అవకాశాలు
దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల సంఖ్య పెరుగుతున్న సమయంలో రైల్వే మౌలిక సదుపాయాల నాణ్యత, భద్రతపై కూడా చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రీమియం రైళ్లను నడిపించే లోకో పైలట్ ఉద్యోగం మాత్రం యువతలో మంచి ఆకర్షణ కలిగిస్తోంది.
