Revanth Reddy: కేసీఆర్తో నాకున్న బంధం ఇదే.. సీఎం రేవంత్ కీలక కామెంట్స్..
కేసీఆర్ నాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే.. వ్యక్తిగత శత్రువు కాదని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత ఇంట్లోని వారసత్వ పో నడుస్తుందని ఆరోపించారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా అటు బీఆర్ఎస్ను, ఇటు బీజేపీని ఓడించి.. రాబోయే పదేళ్ల కాలం తనదేనని రేవంత్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో పాల్గొన్న ఆయన.. కేసీఆర్తో తనకు ఎటువంటి వ్యక్తిగత కక్షలు లేవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ చీఫ్ కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో పదవుల కోసం అంతర్గత యుద్ధం జరుగుతోందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘కేసీఆర్ ఎదుర్కొంటున్నది రాజకీయ సమస్య కాదు, అది పూర్తిగా వారి కుటుంబ సమస్య. పదవుల కోసం కేటీఆర్, కూతురు పోటీ పడుతున్నారు. గతంలో హరీష్ రావు ముఖ్యమంత్రి అవుతారన్న చర్చ కూడా అందుకే వచ్చింది’’ అని విమర్శించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ మాట్లాడితే, బడ్జెట్పై హరీష్ రావు మాట్లాడుతున్నారని.. వారి మధ్య సమన్వయం లేదని వేలెత్తి చూపారు.
బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఉనికి కోల్పోతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా వచ్చిందని, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో కేటీఆర్ బెట్టింగులు కట్టించారని, అయినా అక్కడ ఓటమి తప్పలేదని రేవంత్ ఆరోపించారు. ‘‘నా లెక్క ఎప్పుడూ ఒకటే.. ఒక దెబ్బకు రెండు పిట్టలు.. వచ్చే ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ను, ఇటు బీజేపీని రెండింటినీ ఓడించి తీరుతాం’’ అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న సంప్రదాయం ప్రకారం.. ప్రజలు తనకు 2024 నుంచి 2034 వరకు అవకాశం ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేసీఆర్ కనీసం ప్రతిపక్ష పాత్రనైనా సరిగ్గా పోషించాలని హితవు పలికారు.
