కంచ గచ్చిబౌలి భూములు వివాదం: సుప్రీంలో ప్రభుత్వానికి దక్కని ఊరట
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పర్మిషన్ తీసుకున్నారా? లేదా? స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు.

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట దక్కలేదు. స్టేటస్ కో కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన సుప్రీం.. తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా.. సూటిగా జవాబు చెప్పండి అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నరికివేతను సమర్థించుకోవద్దు, ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి.. లేదంటే చెరువు దగ్గరే అధికారులకు తాత్కాలిక జైలుపెట్టి అక్కడే ఉంచుతామంటూ కామెంట్ చేసింది.
పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీలేదు, వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. 1996లో తాము ఇచ్చిన తీర్పునకు భిన్నంగా అధికారులు సొంత మినహాయింపులు ఇస్తే వారే బాధ్యులు అవుతారంటూ కామెంట్ చేసింది. ప్రైవేట్ ఫారెస్ట్లో చెట్లు నరికినా సీరియస్గా పరిగణిస్తామంటూ కోర్టు అభిప్రాయపడింది. డజన్ల కొద్ది బుల్డోజర్లతో అడవిలో వంద ఎకరాలు తొలగించారు, అభివృద్ధి చేసుకోవాలనుకుంటే.. తగిన అనుమతులు తీసుకోవాలని చెప్పింది కోర్టు. సిటీలో గ్రీన్ లంగ్ స్పేస్ ఉండాలి, వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారని కోర్టు ప్రశ్నించింది.
రాష్ట్ర ప్రభుత్వం తరపున లాయర్ అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. అన్ని పనులు నిలిపివేశాం, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామంటూ కోర్టుకు వివరించారు. ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేశారు, మినహాయింపులకు లోబడే తాము కొన్ని చెట్లు తొలగించామన్నారు.
సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకుని.. అన్నింటికి మినహాయింపులు ఇచ్చుకున్నారు, ఇది సుప్రీం తీర్పుకు విరుద్ధమంటూ అమికస్ క్యూరీ వాదనలు వినిపించింది. ఈ భూములు తాకట్టుపెట్టి ప్రభుత్వం అప్పులు తెచ్చుకుందంటూ క్యూరీ తమ వాదనలు వినిపించింది. సీఈసీ నివేదికపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇచ్చింది ధర్మాసనం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..