AP Weather: ఆహా.. ఎంత చల్లని వార్త చెప్పారండీ.. ఏపీలో ఎండలకు బ్రేక్.. ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఈ వారం అంతా తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) బులెటిన్ విడుదల చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఉంటాయని.. ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో వీస్తాయని అంచనా వేసింది.

ఏపీలో రాగల రెండు రోజులు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముందని వెల్లడించింది రానున్న ఐదు రోజుల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు ఉండదని వివరించింది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వాయువ్య మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, మరాఠ్వాడ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర-దక్షిణ ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. పశ్చిమ గాలుల ద్రోణి 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం.. 84 డిగ్రీల తూర్పు రేఖాంశం మధ్య వెంబడిస్తూ, సగటు సముద్ర మట్టానికి 5.8, 9.6 కిలోమీటర్ల మధ్య ఎత్తులో ఉంది. అంతేకాక.. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఈనెల 30, మే 1వ తేదీల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడనున్నాయి. ఉరుములు- మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి, రెండు చోట్ల కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం,అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి,పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపంది. ఏప్రిల్ 29, మంగళవారం కోనసీమ(D) ఆత్రేయపురంలో 31మిమీ అధిక వర్షపాతం నమోదయినట్లు తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
