
బీఆర్ఎస్ అసంతృప్తులు ఏకమవుతున్నారా? పార్టీలో ఉంటూ మాటల తూటాలు పేల్చే నేతలను కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనుమానాలు, సందేహాలు ఎలా ఉన్నా.. ఖమ్మం గుమ్మంలో పొంగులేటి, జూపల్లి కృష్ణారావులు.. సీఎం కేసీఆర్ టార్గెట్గా విమర్శలు ఎక్కుపెట్టడం రాజకీయ వేడి రగిలించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు జూపల్లి కృష్ణారావు. ఇదే వేదికపై సీఎం కేసీఆర్పై విమర్శల వర్షం కురిపించారు ఇద్దరు నేతలు.
ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని.. కానీ అది సాధ్యం కాదన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కుటుంబ స్వార్థానికి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్నారని.. అది పగటి కలేనంటూ విమర్శించారు.
ఎందరో అమరుల ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు జూపల్లి కృష్ణారావు. తెలంగాణలో పాలన ఎప్పుడో గాడి తప్పిందని.. BRS పేరుతో చెత్త పాలనను దేశానికి ఇవ్వాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నా పొంగులేటిపై బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో పొంగులేటి బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పకుండానే ఆత్మీయ సమ్మేళనాలతో హీట్ పుట్టిస్తున్నారు. మొత్తానికి ఒకే వేదికను పొంగులేటి, జూపల్లి పంచుకోవడం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు బీఆర్ఎస్ రెబల్స్ను పొంగులేటి ఏకం చేస్తున్నారా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..