Inspiring Story: నేటి తరానికి స్ఫూర్తి.. పారిశుద్ధ్య పనులు చేస్తూనే పీజీ పూర్తిచేసిన యువకుడు.. సామజిక సేవలో సైతం..

| Edited By: Surya Kala

Jul 23, 2023 | 3:15 PM

కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు.. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించ వచ్చునని నిరూపించాడు యువకుడు. ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలకు ఓర్చు పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తూ పీజీ పూర్తి చేసిన యువకుడు అందరికీ ఆదర్శంగా నిరూపిస్తున్నాడు.  

Inspiring Story: నేటి తరానికి స్ఫూర్తి.. పారిశుద్ధ్య పనులు చేస్తూనే పీజీ పూర్తిచేసిన యువకుడు.. సామజిక సేవలో సైతం..
Inspiring Story
Follow us on

నేటి ఆధునిక యుగంలో సకల సౌకర్యాలు కల్పించినా.. చదువుకోకుండా జీవితాలను నాశనం చేసుకున్న వారు చాలా మంది ఉంటారు. ఎలాంటి వసతులు, సౌకర్యాలు లేకున్నా.. చదువుకోవాలనే జిజ్ఞాస, ఆసక్తితో పాటు బంగారు భవిష్యత్తు కోసం కష్టపడే చదువుకొని కొందరు ఆదర్శంగా నిలుస్తున్నారు. కూలికెళ్తూ కెమిస్ట్రీ లో పీహెచ్‌డీ పూర్తి చేసిన ‘సాకే భారతిని స్ఫూర్తిగా తీసుకుని చదువుకోవాలని విద్యావేత్తలు మేధావులు విద్యార్థులకు సూచిస్తున్నారు.

మిర్యాలగూడకు చెందిన సందీప్‌ కుమార్‌ నిరుపేద కుటుంబం. ఎంతో కష్టపడి టెన్త్ క్లాస్ పూర్తి చేశాడు. అయితే మిర్యాలగూడ మున్సిపాలిటీలో సందీప్ కుమార్ తల్లి పారిశుద్ధ్య కార్మికురాలిగా పని పనిచేస్తుండేది. ఆమె పని చేస్తేనే కుటుంబం గడిచేది. ఉన్నట్టుండి సందీప్ తల్లి పక్షవాతానికి గురై మంచం పట్టింది. దీంతో తల్లి స్థానంలో సందీప్ పారిశుద్ధ్య విధులకు హాజరయ్యే వాడు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న సమయంలో తన టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇంటర్ కాలేజీకి వెళ్తుండే వారు. వారిని చూసి తాను కూడా చదువు కోవాలని అనుకునేవాడు. కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇంటర్ కాలేజీకి వెళ్ళలేకపోయాడు.

పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తూనే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఇంటర్ పూర్తి చేశాడు. తర్వాత ఒక పూట పారిశుధ్య విధులు మరో పూట డిగ్రీ కాలేజీకి వెళ్తూ సందీప్ బిఏ తెలుగును పూర్తి చేశాడు. పీజీ కోసం ఎంట్రెన్స్ రాయగా నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సీటు వచ్చింది. కానీ విధులు నిర్వహిస్తూ నల్లగొండకు వెళ్లి చదువుకోవడం కష్టంగా మారడంతో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఎంఏ హిస్టరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం సందీప్ ఓవైపు విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు సందీప్ సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నాడు.

ఇవి కూడా చదవండి

మిర్యాలగూడ పట్టణంలో వివిధ ఫంక్షన్ హాళ్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను తీసుకువచ్చి బస్టాండ్లు రోడ్ల వెంట ఉండే అనాధలకు పంపిణీ చేస్తుంటాడు. రోడ్ల వెంట మతిస్థిమితం లేకుండా తిరిగే వారిని గుర్తించి అనాధాశ్రమంలో చేర్చుతూ ఉంటాడు. 150 మందితో కలిసి ఒక గ్రూపును ఏర్పాటు చేశాడు. నిరుపేద రోగులకు అవసరమైన రక్తాన్ని బ్లడ్ బ్యాంకుతోపాటు తన గ్రూప్ లోని వ్యక్తుల నుంచి రక్తాన్ని సరఫరా చేస్తుంటాడు. కుటుంబ పోషణ కోసం కష్టపడి పని చేస్తూనే మరోవైపు చదువుకొని సామాజిక సేవ చేస్తున్నానని సందీప్ చెబుతున్నాడు. కష్టపడి ఏదైనా జాబ్ సాధించాలని అనుకుంటున్నట్లు సందీప్ చెబుతున్నాడు.
పారిశుద్ధ్య పనులు చేస్తూనే పీజీ పూర్తి చేసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందీప్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..