
హైదరాబాద్ సమీపంలోని IITA మొయినాబాద్లో 25వ బ్యాచ్ పోలీసు జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. నేర పరిశోధనలో సరికొత్త జవజీవాలు నింపుతూ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈ బ్యాచ్కు చెందిన 76 జాగిలాలు ఇక విధుల్లోకి చేరనున్నాయి. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆధ్వర్యంలో కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న ఈ జాగిలాలు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ పరేడ్లో పాల్గొన్నాయి.
ఈ 25వ బ్యాచ్లో తెలంగాణకు చెందిన 42 జాగిలాలతో పాటు, బీహార్ సి.ఐ.డి విభాగం నుంచి 30, హైదరాబాద్ విమానాశ్రయ భద్రత కోసం సి.ఐ.ఎస్.ఎఫ్ నుంచి 4 జాగిలాలు శిక్షణ పొందాయి. వీటితో పాటు 76 మంది ప్రధాన హ్యాండ్లర్లు, 29 మంది స్పేర్ హ్యాండ్లర్లు కలిపి మొత్తం 105 మంది సిబ్బంది ప్రత్యేక శిక్షణను పూర్తిచేశారు.
శిక్షణ పొందిన జాగిలాలలో వివిధ రకాల జాతులు ఉన్నాయి. మొత్తం 76 జాగిలాలలో 28 లాబ్రడార్, 27 జర్మన్ షెపర్డ్, 15 బెల్జియన్ మెలినోయిస్, 2 కోకర్ స్పానియల్ జాతులకు చెందినవి ఉన్నాయి. వాటి నైపుణ్యాన్ని బట్టి మూడు ప్రధాన విభాగాలుగా విభజించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పేలుడు పదార్థాలను పసిగట్టేందుకు 45 జాగిలాలు, మాదకద్రవ్యాల గుట్టు రట్టు చేసేందుకు 22, నిందితుల అడుగుజాడలను వెంబడించేందుకు 9 జాగిలాలను సిద్ధం చేశారు. బీహార్ సి.ఐ.డి నుంచి వచ్చిన జాగిలాలలో 20 జాగిలాలను కేవలం మాదకద్రవ్యాల గుర్తింపుకు ప్రత్యేకంగా కేటాయించారు.
ఈ నూతన జాగిలాల రాకతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్, రామగుండం, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలతో పాటు రాచకొండ కమిషనరేట్, గ్రేహౌండ్స్ విభాగాలు మరింత బలోపేతం కానున్నాయి. హైదరాబాద్లోని సి.ఎస్.డబ్ల్యూ విభాగానికి అత్యధికంగా 12 జాగిలాలను కేటాయించడం విశేషం. ఈ జాగిలాల సేవలతో నేర నిరోధక చర్యలు మరింత వేగవంతం కానున్నాయని అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.