AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: ఇప్పట్లో తగ్గేదేలే.. వర్షాలే వర్షాలు..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాలను వానలు వరదలు ముంచెత్తుతున్నాయి. చెప్పాలంటే.. దేశవ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి. ఏపీ, తెలంగాణకు రెండ్రోజుల పాటు భారీ వర్షాలు తప్పవన్న వాతావరణ శాఖ.. దేశంలోని పలు రాష్ట్రాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. సో, ఇప్పట్లో వానలు, వరదలు తగ్గేలా కనిపించడం లేదు.

Rain Alert: ఇప్పట్లో తగ్గేదేలే.. వర్షాలే వర్షాలు..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Jul 26, 2024 | 5:11 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో కరువుతీరా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళఖాతంలో అయితే ఒకదాని తరువాత ఒక అల్పపీడనం ఏర్పడుతూనే ఉంది. దీంతో ఇప్పట్లో ముసురు ఆగదు.. వర్షాలు తగ్గవు అనేలా పరిస్థితి కనిసిస్తోంది.. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపుల‌తో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందనే హెచ్చరికలు జారీ చేసింది.

ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శుక్రవారం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లోని అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

కాగా.. నాలుగు రోజులుగా ముసురు ఏకధాటిగా పడుతుండటంతో రెండు రాష్ట్రాల్లోనూ వాగులు, వంకలు పొంగి చెరువులు నిండాయి. బ్యారేజీల్లోకి వరద పోటెత్తుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి వరద ప్రవాహం 48 అడుగులకు చేరింది. దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ వరద పోటు మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. దిగువ పోలవరానికి 11 లక్షల 31వేల క్యూసెక్కుల వరద వెళ్తోంది.

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో అయితే కుంభవృష్టి కురుస్తోంది. భారీ వర్షాలకు ముంబై నగరం స్తంభించిపోయింది. వాతావరణ శాఖ ముంబై, పూనేకి ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక దక్షిణ కర్నాటక, కోస్తా కర్నాటకకు భారీ వర్ష సూచన చేశారు. కేరళలోని కొట్టాయం జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై సహా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. కొంకణ్‌-గోవా, గుజరాత్, ఒడిశాలో 12 సెంటీమీటర్లకు మించి అతి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. పంజాబ్, రాజస్తాన్, హర్యానా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బలమైన తుపాను ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..