ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్.. భర్తకు దూరంగా ఉంటున్న మరో మహిళతో రిలేషన్.. గదిలో దొరికిన..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదుతో అరెస్టైన ఉదయ్కు మరో మహిళతో సన్నిహిత సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. అశోక్నగర్లోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు ప్రేమలేఖలు, ల్యాప్టాప్, సెల్ఫోన్, కత్తిని స్వాధీనం చేసుకుని పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. మరో మహిళ ఇచ్చిన వివరాలు, సేకరించిన ఆధారాల ఆధారంగా కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి.. సస్పెండ్, అరెస్ట్తో హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ పేరు.. ఆల్ ఆఫ్ సడెన్గా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై.. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి సంచలన ఆరోపణలు చేశారు. లైంగిక దాడి, బెదిరింపులు, వేధింపులకి గురిచేశాడని ఆమె ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ కేసులో ఉదయ్ అరెస్ట్తో పాటు రిమాండ్ కూడా జరిగిపోయింది. అయితే.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి.. ఉదయ్ కృష్ణారెడ్డికి మరో మహిళతోనూ సన్నిహిత సంబంధాలున్నాయని పోలీసులు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ట్రైనీ మహిళా ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే.. ఉదయ్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. అయితే.. ఉదయ్ కృష్ణారెడ్డి మరో మహిళతోనూ రిలేషన్షిప్ లో ట్రైనీ మహిళా ఐపీఎస్ ఫిర్యాదు చేయగా.. ఆ దిశగా దర్యాప్తు చేసిన అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం..
రెండు ప్రేమ లేఖలు స్వాధీనం..
కేసు దర్యాప్తులో భాగంగా.. పోలీసులు అశోక్నగర్లోని ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఉదయ్ కృష్ణారెడ్డి ల్యాప్టాప్, సెల్ఫోన్ అలాగే.. ఇద్దరు వ్యక్తుల చేతిరాతతో ఉన్న రెండు ప్రేమ లేఖలు, కత్తి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ప్రేమలేఖలపై రాసిన పేర్ల ఆధారంగా ఆరా తీసిన పోలీసులకు మరో కొత్త ఆధారం దొరికింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళతో సన్నిహిత సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్నారు. సదరు మహిళకు 2014లోనే వివాహం కాగా.. ఆమె 2023 నుంచి భర్తకు దూరంగా కుమారుడితో కలిసి ఉంటోంది.. ఈ సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డితో ఆమెకు స్నేహం కుదిరింది. హైదరాబాద్ వచ్చిన ఆమె కొంతకాలం ప్రైవేటు సంస్థలో పనిచేసి.. ఈ ఏడాది జనవరిలో ఉదయ్ కృష్ణారెడ్డి సూచనల మేరకు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అనంతరం అశోక్నగర్లోని ఓ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తోంది. అయితే.. లివ్ ఇన్ రిలేషన్లో ఉందామని ఉదయ్ కృష్ణారెడ్డి కోరినా.. చట్టప్రకారం విడాకులు రాకపోవటంతో ఆమె తిరస్కరించినట్టు తెలుస్తోంది.
ఎలా బయటకు వచ్చిందంటే..
అశోక్నగర్లో ఉంటున్న ఆ మహిళను మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిబ్రవరిలో కలవగా.. ఈ విషయం బయటకు వచ్చింది. తాను కూడా ఉదయ్ తో సన్నిహితంగా ఉన్నానని, ఆయన తనపై దాడి చేస్తున్నాడని.. ఇబ్బంది పెడుతున్నాడంటూ మహిళా ట్రైనీ ఐపీఎస్ బాధను పంచుకున్నట్లు సమాచారం.. దీంతో సదరు మహిళ నిందితుడికి దూరంగా ఉంటున్నట్టు గుర్తించారు. అయితే.. ఈ కేసులో పలు కోణాల్లో విచారణ జరుపుతున్న పోలీసులు పలువురి నుంచి వాంగ్మూలాలు సేకరించినట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
