
హైదరాబాదు, డిసెంబర్ 21: నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లోని వైద్యులు అరుదైన క్యాన్సర్తో బాధపడుతోన్న యువతికి విజయ వంతంగా చికిత్స అందించారు. గ్లియోబ్లాస్టోమా అనే అరుదైన బ్రెయిన్ కేన్సర్తో బాధపడుతున్న యువతికి కొత్త రకం వ్యాక్సిన్ ద్వారా చికిత్స అందించారు. ఈ విధమైన క్యాన్సర్ మెదడు లేదా వెన్నుపాములోని నరాల కణాల్లో ఏర్పడుతుంది. మెదడు క్యాన్సర్తో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న రోగిని క్షుణ్ణంగా పరీక్షించిన అనంతరం వైద్యులు అసలు కారణాన్ని గుర్తించ గలిగారు. రోగి శరీరంలో మళ్లీ తటస్థించడానికి దోహదపడే అరుదైన జన్యు మార్పును గుర్తించారు.
ఈ వ్యాధి నిర్మూలనకు డెన్డ్రిటిక్ సెల్ థెరపీ అనే కొత్త రకం చికిత్సా పద్ధతి ద్వారా వైద్యం అందించాలని వైద్యులు నిర్ణయించుకున్నారు. రోగి రోగనిరోధక యంత్రాంగం ద్వారా క్యాన్సర్ కణాలను ఎదుర్కోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో చికిత్సలో భాగంగా రోగి రోగనిరోధక కణాలు, క్యాన్సర్ కణాలు రెండింటినీ సేకరించి, వీటి ద్వారా వ్యాక్సిన్ను అభివృద్ధి చేసేందుకు డ్రగ్ తయారీదారులతో కలిసి పనిచేశారు. వ్యాక్సిన్ ఇంట్రా-డెర్మల్గా ఇవ్వబడుతుంది. వీరు తయారు చేసిన వ్యాక్సిన్ గ్లియోబ్లాస్టోమా క్యాన్సర్ను ఎదరుక్కోవడంతో అద్భుతంగా పనిచేసింది. చర్మం లోపలి నుంచి క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడేలా దీనిని తయారు చేశామని కాంటినెంటల్ హాస్పిటల్ మెడికల్ ఆంకాలజీ, హెమటాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎవిఎస్ సురేష్ చెప్పారు.
సంక్లిష్టత కలిగిన ఇటువంటి అరుదైన క్యాన్సర్ కేసును పరిష్కరించడంలో తాము అందించిన చికిత్స సానుకూల అభివృద్ధిని సూచించినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఆంకాలజీ రంగంలో వినూత్న వైద్య విధానాలను అవలంభించే సామర్థ్యం ఉన్నట్లు ఆయన డాక్టర్ ఎవిఎస్ సురేష్ మీడియాకు తెలిపారు.
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.