Rangareddy: అంత చిన్న గొడవకే ఇంత దారుణమా.. అసలు ఏం జరిగిందంటే?
ఒక మనిషిని చంపడానికి చాలా ధైర్యం కావాలనేది ఒకప్పటి మాట.. ఇప్పుడు సుపారీ ఇస్తే చాలు, మనిషిని చంపడం కూడా ఒక వ్యాపారంలా మార్చుకున్నారు. ఏ పంచాయతీ లేదు.. న్యాయస్థానం ఉంటుందన్న భయమూ లేదు.. మనిషి తనే సొంతంగా నిర్ణయం తీసుకుని సాటి మనిషిని చంపే వరకు పరిస్థితులు మారిపోయాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. లావాదేవీల విషయంలో వచ్చిన చిన్న తగాదా కాస్తా.. మనిషిని అతి దారుణంగా చంపించేంత వరకు వచ్చింది. ఇంతకు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.

లావాదేవీల విషయంలో వచ్చిన చిన్న వివాధంలో ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఏకంగా సుపారీ ఇచ్చి హత్య చేయించేందకు ప్రయత్నించిన ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్ మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 9 లక్షల రూపాయలకు ఒక వ్యక్తిని చంపడానికి సుపారీ ఇచ్చారు. వట్టేపల్లికి చెందిన ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి గతంలో పాత వాహనాలను అమ్ముకునే వ్యాపారం చేస్తుండేవాడు. అయితే ఇతనికి వ్యాపారంలో భాగంగా షేక్ అమీర్, మహమ్మద్ సోయల్ అనే ఇద్దరు వ్యక్తులతో లావాదేవీల విషయంలో గొడవలు మొదలయ్యాయి. ఈ కారణంగా ఇమ్రాన్పై పగ పెంచుకున్న ఆ ఇద్దరు.. ఇమ్రాన్ ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేశారు. అప్పటి నుంచి కక్ష పెంచుకుని ఎలాగైనా ఇమ్రాన్ని హత్య చేయాలని ప్లాన్ చేశారు. అనుకున్న ప్రకారమే ఇమ్రాన్ని చంపడానికి ఓ ముగ్గురు వ్యక్తులతో సుపారీ ఒప్పందం చేసుకున్నారు.
ఈ క్రమంలో ఇమ్రాన్ని ఆ ముగ్గురు వ్యక్తులు అతి దారుణంగా చంపి అక్కడి నుంచి పారిపోవాలి అనుకున్నారు. కానీ వాళ్ల ప్లాన్ బెడిసి కొట్టి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. పక్కా సమాచారం మేరకు సుపారీ తీసుకున్న ఆ ముగ్గురు వ్యక్తులను మైలార్దేవ్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొద్దిలో ఇమ్రాన్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. లావాదేవీల విషయంలో వచ్చిన చిన్న తగాదా వల్ల షేక్ అమీర్, మహమ్మద్ సోయల్ అనే వ్యక్తులు ఈ హత్యకు సుపారీ ఇచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది.
సుపారీ తీసుకున్న వ్యక్తులు మహమ్మద్ సాహెబ్, నానావత్ శ్రీరామ్ దగ్గర నుంచి రెండు కత్తులు, మూడు సెల్ ఫోన్లు, ఫ్యాషన్ ప్రో బైక్, యాక్టివా మోటార్ సైకిల్తో పాటు పది వేల రూపాయలని పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సుపారీ తీసుకున్నవారితో పాటు షేక్ అమీర్, మహమ్మద్ సోయల్లను రిమాండ్కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




