
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఆందోళనకారులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. వందల మంది ఇంకా పట్టాలపై ఆందోళన చేస్తున్నారు. ఆందోళన విరమించాలని పోలీసులు చెబుతున్నా ససేమిరా అంటున్నారు యువకులు. దాంతో ఏం చేయాలో తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. ఆందోళనకారులతో పోలీసుల చర్చలు విఫలమయ్యాయి.10మంది చర్చలకు రావాలని ఆహ్వానించారు పోలీసులు. అయితే, పది మంది కాదు, రెండొందల మంది వస్తామని ఆందోళనకారులు చెబుతున్నారు. ఇలాగే పట్టాలపై కూర్చుంటే స్ట్రాంగ్ యాక్షన్ ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే ఊరుకునేది లేదని అడిషనల్ సీపీ శ్రీనివాస్ చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసాన్ని కేంద్ర హోంమంత్రి(Amit Shah) దృష్టికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) తీసుకెళ్లారు. సికింద్రాబాద్ స్టేషన్లో నెలకొన్న పరిస్థితులను వివరించారు. రైళ్లు తగులబెట్టడం, ఆందోళనకారుల నిరసనలు వంటి అంశాల గురించి తెలిపారు. ఈ విధ్వంసం వెనక కుట్ర ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం వెనక టీఆర్ఎస్, మజ్లిస్ హస్తం ఉందని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ ఘటనను పక్కదోవ పట్టించేందుకే పక్కా ప్లాన్ ప్రకారం విధ్వంసం సృష్టించాయని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అన్యాయం చేయదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. చెడు మాటలు విని యువకులు తప్పుదోవ పట్టొద్దని కోరారు. అగ్నిపథ్ స్కీమ్పై యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పథకాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే బాగుంటుందని యువతకు సలహా ఇచ్చారు. సికింద్రాబాద్ విధ్వంసానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని కోదండరాం ఆరోపించారు.
అయితే.. పక్కాప్లాన్తోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం జరిగిందని తెలుస్తోంది. రెండు, మూడు రోజుల నుంచి వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్న చర్చలు, ఒకేసారి వందల మంది రావడంపై వెనక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి