
కొత్త కారు కొన్నాడు.. దానిని స్పీడ్ టెస్ట్ చేద్దామనుకున్నాడు.. అలా కారు బయటకు తీసి ఓర్ఆర్ఆర్పైకి వెళ్లాడు.. ఇక స్పీడ్ టెస్ట్ చేసేందుకు కారు వేగాన్ని ఏకంగా వంద నుంచి 200లకు పెంచాడు. దాన్ని వీడియో తీసి ఇదిగో నా కొత్త కారు 200 స్పీడ్లో వెళ్తొందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కానీ అదే అతనికి కష్టాలు తెచ్చిపెడుతుందని ఊహించలేకపోయాడు. వీడియో కాస్త వైరల్గా మారి పోలీసుల దృష్టికి చేరడంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కార్ సీజ్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లోని మణికొండలో ఉన్న అల్కాపూర్ కాలనీకి చెందిన కొత్తపల్లి యశ్వంత్రెడ్డి అనే వ్యక్తి ఇటీవలే కొత్త కారును కొనుగోలు చేశారు. అయితే దానిని స్పీడ్ టెస్ట్ చేసేందుకు ఈ నెల 10న కారును నార్సింగి నుంచి తెలంగాణ పోలీసు అకాడమీ వరకు ఓఆర్ఆర్పై మితిమీరిన వేగంతో ట్రైవ్ చేశాడు. అయితే ORRపై స్పీడ్ లిమిట్ 120 కిలో మీటర్స్ ఉండగా అతను నిబంధనలకు విరుద్దంగా ఏకంగా 200కి. మీ మించి వేగంతో కారు నడిపాడు. అంతటితో ఆగకుండా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అయితే ఆన్లైన్లో ఈ వీడియోను చూసింది. ఓఆర్ఆర్ పెట్రోలింగ్ ఆఫీసర్ సాయిరాం ఘటనపై నార్సింగి పీఎస్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని కొత్త కారును స్వాదీనం చేసుకున్నారు. అయితే కొత్త కారు సామర్థ్యాన్ని పరిశీలించేందుకు తాను స్పీడ్గా కారును డ్రైవ్ చేసినట్టు యశ్వంత్రెడ్డి అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.