Telangana: బీజేపీ ఆధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణపై వివక్ష.. కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్
కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పై తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. హైదరాబాద్ కు ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసినట్లు పార్లమెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఐటీఐఆర్....
కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పై తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. హైదరాబాద్ కు ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసినట్లు పార్లమెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఐటీఐఆర్ స్థాయిలో తెలంగాణకు పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంట్ (Parliament) లో అబద్దాలు చెప్పి, ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఐటీఐఆర్ రద్దుతో హైదరాబాద్ (Hyderabad) ఐటీ పరంగా మరింతగా ఎదిగే అవకాశాన్ని కోల్పొయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే తెలంగాణపై వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ఐటీఆర్ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్, తాను ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను ఎన్నోసార్లు కోరామని, అయినప్పటికీ తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదని విమర్శించారు. నోట్ల రద్దు, లాక్ డౌన్ వంటి పరిస్థితులతో ఏర్పడ్డ ఆర్థిక, సామాజిక సంక్షోభంలోనూ దేశ సగటును మించి తెలంగాణ అధ్బుతమైన ప్రగతిని సాధించిందని కేటీఆర్ వివరించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు ఉండి ఉంటే గడిచిన ఏడేళ్లలో హైదరాబాద్ ఆకాశమే హద్దుగా ఎదిగేదని, తాజాగా మంత్రి ప్రకటనతో ఆ అవకాశం లేకుండా పోయినందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయంగా తమకు ప్రయోజనం కాదన్న కారణంతో ఐటీఐఆర్ను రద్దు చేశారు. తెలంగాణ ఐటీ గ్రాడ్యుయేట్లు, యువతకు మోడీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి. ఈ నిర్ణయంతో తెలంగాణకు జరిగిన నష్టంపై వివరణ ఇవ్వాలి. గుజరాత్, ఉత్తరప్రదేశ్లకు లెక్కలేనన్ని కేంద్ర పథకాలను మంజూరు చేస్తున్న మోడీ ప్రభుత్వం తెలంగాణకు మాత్రం ఎలాంటి పథకాలు ఇవ్వడం లేదు. ఐటీఐఆర్కు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ కు ఏం ఇచ్చారో చెప్పాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా పయనిస్తున్న తెలంగాణ ప్రగతిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
– కేటీఆర్, తెలంగాణ ఐటీ మంత్రి
22 సాప్ట్వేర్ పార్కులను ప్రకటించిన కేంద్రం తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపిందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేంద్రానికి తెలంగాణపై ఉన్న భావన ఏంటో అర్థమవుతోందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ టీహబ్ రెండో దశ నిర్మాణాన్ని రూ.450 కోట్లతో పూర్తి చేశామని, దానికి కేంద్రం పైసా కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఇక్కడి యువత గమనించాలని కోరారు. ఇప్పటికైనా తెలంగాణ ఐటీ రంగానికి ఐటీఐఆర్కు సమానంగా ఒక పథకాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి