Telangana: వారి కన్ను పడిందంటే చాలు ఎలాంటి బైకు అయినా మాయం అవ్వాల్సిందే. పకడ్బందీగా రెక్కీ చేసి.. ఎంతటి కఠినమైన లాకులు వేసినా.. గుట్టుచప్పుడు కాకుండా సులువుగా తీసేసి బైకులను దర్జాగా తీసుకెళ్లిపోతారు. కానీ తాజాగా గ్యాంగ్లోని ఓ సభ్యుడు అనుకోని రీతిలో పోలీసులకు చిక్కాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వారి గ్యాంగ్ డీటేల్స్, ట్రాక్ రికార్డ్ చూసి పోలీసులు కంగుతిన్నారు. వివరాల్లోకి వెళ్తే.. చాంద్రాయణగుట్ట(Chandrayangutta)లో రాత్రివేళ వెహికల్ చెకింగ్ చేస్తుండగా బైకుపై వచ్చిన శ్రీకాంత్ను పోలీసులు ఆపారు. అతని వద్ద వాహనానికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించారు. ఎంక్వైరీలో కళ్లు బైర్లు గమ్మే నిజాలు వెలుగుచూశాయి. అతను బైక్స్ దొంగిలించే ఓ మాస్టర్ గ్యాంగ్లో సభ్యుడని గుర్తించారు. మిగతా సభ్యులను గుర్తించి.. వారి నుంచి 53 ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. ముగ్గురు సభ్యులు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కేశంపేటకు చెందిన గణేష్ నుంచి కొన్ని బైకులు, చోలపల్లికి చెందిన సత్తు శ్రీశైలం నుంచి మరికొన్ని బైకులను పోలీసులు రికవరీ చేశారు. వీటిలో హైదరాబాద్ పరిధిలో 11, రాచకొండ పరిధిలో 18, సైబరాబాద్లో 17, మిగిలిన జిల్లాలో 7 వాహనాలు విక్రయించినట్లు పోలీసులు గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్ల్పెండర్, గ్లామర్, ప్యాషన్ వాహనాలను టార్గెట్ చేస్తూ డూప్లికేట్ కీస్ తయారు చేసి వీరు దొంగతనాలు చేశారని పోలీసులు తెలిపారు.
నూర్ మహ్మద్, టీవీ9, హైదరాబాద్
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..