IRCTC : తక్కువ ధరలో జ్యోతిర్లింగ దర్శన యాత్ర.. సికింద్రాబాద్ నుంచి భారత్ టూరిస్ట్ రైలు
జనవరి 23వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి యాత్ర ప్రారంభంకానుంది. టూర్ ప్యాకేజీలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడుతో పాటు కేరళలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను కవర్ చేస్తుంది. 9 రోజులు సాగే ఈ జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్ర తెలుగు రాష్ట్రాల్లో భక్తులకు..

ప్రయాణికులకు తక్కువ ధరలో టూర్ ప్యాకేజీలను అందిస్తూ వస్తోంది ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ). ఇందులో భాగంగానే భారత్ గౌర్ రైళ్లు పేరుతో నడిపిస్తున్న రైళ్లకు ప్రయాణికుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనతో తాజాగా.. మరో టూరిజం ప్యాకేజీని అందులోకి తీసుకొచ్చింది. ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో ఈ టూరిస్ట్ సర్క్యూట్ రైలు యాత్రను అందుబాటులోకి తీసుకొచ్చింది.
జనవరి 23వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి యాత్ర ప్రారంభంకానుంది. టూర్ ప్యాకేజీలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడుతో పాటు కేరళలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను కవర్ చేస్తుంది. 9 రోజులు సాగే ఈ జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్ర తెలుగు రాష్ట్రాల్లో భక్తులకు జ్యోతిర్లింగ (రామేశ్వరం) దర్శనానికై ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే తిరువణ్ణామలై (అరుణాచలం), మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు లను కవర్ చేస్తుంది.
సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మంతో పాటు విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట స్టేషన్లో ప్రయాణికులు ఎక్కొచ్చు, దిగ్గొచ్చు. ఈ యాత్ర మొత్తం 8 రాత్రులు/9 రోజుల పాటు సాగుతుంది. జనవరి 23 నుంచి 31 జనవరి వరకు యాత్ర ఉంటుంది. ఇప్పటికే ఈ యాత్రకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఆసక్తిగల ప్రయాణికులు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. లేదా 040-27702407, 9701360701, 9985696813, 9281495843, 8287932228, 8287932229 నెంబర్లను సంప్రదించవచ్చు.
ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 23-01-2024 తేదీన మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరుతుంది. తిరిగి జనవరి 31వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. ప్యాకేజీ ధర విషయానికొస్తే.. జీఎస్టీతో కలిపి ఒక్కొక్కరి.. ఎకానమీ కేటగిరీ (స్లీపర్) రూ. 14,100కాగా, 3 ఏసీ ధర రూ. 21,500, కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ) దర రూ. 27,900గా నిర్ణయించారు. ప్యాకేజీలో భాగంగా.. తిరువణ్ణామలై (అరుణాచలం దేవాలయం), రామేశ్వరం (రామనాథస్వామి దేవాలయం), మదురై (మీనాక్షి అమ్మన్ ఆలయం), కన్యాకుమారి (వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం , కుమారి అమ్మన్ ఆలయం), త్రివేండ్రం (శ్రీ పద్మనాభస్వామి ఆలయం), తిరుచ్చి (శ్రీ రంగనాథస్వామి దేవాలయం), తంజావూరు (బృహదీశ్వరాలయం) ప్రాంతాలు కవర్ అవుతాయి.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..