
Tirumala Darshan: హైదరాబాద్ నుంచి తరచూ వేలమంది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుంటారు. రైళ్లు, బస్సుల ద్వారా ఎక్కువమంది తిరుపతికి వెళుతుంటారు. ఇక వేగంగా వెళ్లి దర్శనం చేసుకుని రావాలనుకునేవారు శంషాబాద్ నుంచి తిరుపతికి విమానంలో వెళుతుంటారు. రైల్లో వెళ్లాలనుకుంటే సికింద్రాబాద్, కాచిగూడ నుంచి అనేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక తిరుపతికి వందే భారత్ రైలు కూడా సర్వీస్ అందిస్తోంది. ఇక బస్సుల్లో వెళ్లాలనుకుంటే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజ్ కింద ప్రత్యేక రైళ్లను కూడా తిరుమతికి నడుపుతోంది.
హైదరాబాద్ నుంచి తిరుపతికి విమానంలో వెళ్లాలనుకునేవారికి శుభవార్త అందింది. హైదరాబాద్-తిరుపతి మధ్య ఇండిగో విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇండిగో సంక్షోభం క్రమంలో డిసెంబర్ 18 నుంచి ఇండిగో సర్వీసులు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ రీస్టార్ట్ అయ్యాయి. ఈ విమానం మధ్యాహ్నం 2.25 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 3.05 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇది తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.25 గంటలకు బయల్దేరుతుంది. మళ్లీ ఈ విమానం మొదలుకావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి ప్రయోజనం కలగనుంది.
ఇండిగో సంక్షోభం గత నెలలో దేశవ్యాప్తంగా ఓ కుదుపు కుదిపేసింది. దేశవ్యాప్తంగా 2 వేలకుపైగా విమానాలు ఒక్కసారిగా క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఎయిర్ పోర్టుల్లో ఆందోళనకు కూడా దిగారు. దీంతో కేంద్రం స్పందించి వెంటనే ఇండిగోకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రయాణికులకు వెంటనే రీఫండ్ అందించాలని ఆదేశించింది. దీంతో ఇండిగో తమ ప్రయాణికులందరికీ డబ్బులను రీఫండ్ చేసింది. కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న ఇండిగో ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్లీ సర్వీసులను పున:రుద్దరిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్-తిరుపతి విమానాలను కూడా పున:రుద్దరించింది.