Hyderabad Police: గుజరాత్ గడ్డపై హైదరాబాద్ పోలీస్ సెన్సేషనల్ ఆపరేషన్.. ఇంతకీ అదేంటంటే
గుజరాత్లో డెన్... తెలంగాణలో నేరాలు! ఒకటి కాదు..రెండు కాదు పదుల సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో గట్టి నిఘా పెట్టింది సైబర్ క్రైమ్ పోలీస్ టీమ్. ముల్లును ముల్లుతోనే తీయాలనే కసితో సైబర్ టెక్నాలజీని వినియోగించి భారీ ఆపరేషన్ చేపట్టింది.
గుజరాత్లో డెన్… తెలంగాణలో నేరాలు! ఒకటి కాదు..రెండు కాదు పదుల సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో గట్టి నిఘా పెట్టింది సైబర్ క్రైమ్ పోలీస్ టీమ్. ముల్లును ముల్లుతోనే తీయాలనే కసితో సైబర్ టెక్నాలజీని వినియోగించి భారీ ఆపరేషన్ చేపట్టింది. గుజరాత్లోనే తిష్టవేసి దేశంలోనే మోస్ట్వాంటెడ్ క్రిమినల్స్ భరతం పట్టారు. ఏకంగా పదుల సంఖ్యలో నేరస్థులను హైదరాబాద్కి తీసుకొచ్చి రికవరీ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.
ఇప్పుడంతా స్మార్ట్…టెక్నాలజీ మయం! అరచేతిలోనే ప్రపంచం. అవును…టెక్నాలజీ పెరిగింది. కానీ..అదే రేంజ్లో సైబర్ నేరాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడో కూర్చొని టెక్నాలజీ సహాయంతో జనాలను ఇట్టే మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇన్వెస్ట్మెంట్, ఇతర పేర్లతో కోట్ల రూపాయలను కొళ్లగొడుతున్నాయి ముఠాలు. ఈ క్రమంలో హైదరాబాద్లోనూ సైబర్క్రైమ్ నేరాలు పెరిగిపోవడంతో దానిపై దృష్టిపెట్టారు పోలీసులు. ఈ ముఠాల కోసం ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు సైబర్ క్రైమ్ పోలీసుల బృందాలు వెళ్లాయి. సైబర్ ముఠాలకు అకౌంట్స్ సప్లయ్ చేస్తున్న వారితో పాటు అకౌంట్ హోల్డర్లలను విచారించి డబ్బు రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నాయి.
గుజరాత్ సిటీలో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఈ మిషన్లో ఓ చార్టెడ్ అకౌంటెంట్ సహా మొత్తం 36 మంది మోస్ట్ వాటెంటెడ్ నిందితులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి తెలిపారు. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో ఏడుగురు సైబర్ క్రైమ్ కింగ్ పిన్స్ ఉన్నట్లు వెల్లడించారు హైదరాబాద్ సీపీ. నిందితులపై దేశవ్యాప్తంగా మొత్తం 983 కేసులు నమోదు అయ్యాయని.. ఇందులో 11 ఇన్వెస్ట్ మెంట్, 4 ట్రేడింగ్ , 4 ఫిడెక్స్, కొరియర్ ఫ్రాడ్స్కు సంబంధించిన కేసులు ఉన్నట్లు సీపీ తెలిపారు. పెరిగిన టెక్నాలజీతోనే సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ పేరుతో వాట్సాప్ లింక్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు సీపీ శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు.
FedEx ఫ్రాడ్లో సైబర్ నేరగాళ్లు రకరకాలుగా బెదిరించి డబ్బులు కాజేస్తుంటారన్నారు సీపీ శ్రీనివాస్రెడ్డి. విచారణకు రావాలని ఫేక్ FIR, నకిలీ RBI లెటర్, సీబీఐ లెటర్లు పంపి కోట్ల రూపాయల ఫ్రాడ్ చేస్తున్నారని తెలిపారు. పెరిగిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ఇటీవల సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఓటీపీ, లింక్ ల పేరుతో క్షణాల్లోనే కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు సీపీ. మొత్తానికి ఎక్కడో గుజరాత్లో ఉండి… తెలంగాణలో సైబర్క్రైమ్ నేరాలకు పాల్పడుతున్న మోస్ట్వాంటెడ్ క్రిమినల్స్ భరతం పట్టారు తెలంగాణ పోలీసులు. తెలంగాణలో 131 కేసుల్లో ప్రమేయం ఉన్న నిందితుల నుంచి డబ్బులు రికవరీ చేశారు పోలీసులు.