
రామ మందిర శంకుస్థాపనకు మరికొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది..ఈ మహా చరిత్రాత్మక వేడుక కోసం రామనగరి అయోధ్యను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు..జై శ్రీరామ్ నినాదాల మధ్య అయోధ్య నగరమంతా పూలతో అలంకరించారు. ఈ వేడుకను ప్రత్యేకంగా, గుర్తుండిపోయేలా చేసేందుకు ప్రాంగణం మొత్తాన్ని రంగురంగుల పూలమాలలతో నింపేశారు. ఇప్పుడు ప్రపంచం చూపు అంతా అయోధ్యవైపే ఉంది. ఈ క్రమంలో హిందూ ఐక్యత చాటేలా అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని భాగ్యనగరం నడిబొడ్డన.. కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు కృష్ణ ధర్మపరిషత్ (ఆల్ ఇండియా) నిర్ణయించింది. పరిషత్ అధ్యక్షులు అభిషేక్ గౌడ్, ఉపాధ్యక్షులు అనిష్ గౌడ్, కార్యదర్శి సాయిరామ్ యాదవ్, కార్యదర్శి అశోక్ కృష్ణ ధర్మ పరిషత్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
జనవరి 22, సోమవారం.. హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహాం పక్కన, ప్రసాద్ మల్టీప్లెక్స్ సమీపంలో భారీ ఎత్తున మధ్నాహ్నం 4 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీరామ్ పూజతో కార్యక్రమానికి అంకురార్పణ చేయనున్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. వచ్చే అశేష భక్తులు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధ్యాత్మికత పరడవిల్లేలా శ్రీరామ్, హనుమాన్.. ఇతర దేవుళ్ల కీర్తనలు, పాటలతో భక్తిలహరి ఏర్పాటు చేస్తున్నారు. డాన్స్ ఆర్టిస్ట్ తో స్క్రీన్ పైన శ్రీరామచరిత్ర ప్రదర్శనకు పూనుకున్నారు. అదే విధంగా మహాభారతం, పూరీ జగన్నాధ్ శాండ్ ఆర్టిస్ట్ షో ఏర్పాటు చేస్తున్నారు.
కాగా ఈ కార్యక్రమంలో భాగంగా అయోధ్య ప్రత్యేకత, విశిష్ఠత వివరిస్తూ ఆకట్టుకొనే డాక్యుమెంటరీ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు అభిషేక్ గౌడ్ తెలిపారు. అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ యావత్ భారతావనికే గర్వకారణమన్నారు. హాజరయ్యే భక్తులను ఉద్దేశించి ఆల్ ఇండియా కృష్ణ ధర్మపరిషత్ నిర్వాహకుల ప్రసంగాలు ఇస్తారు. ముఖ్య అతిధి డాక్టర్ కే లక్ష్మణ్ సందేశం ఇస్తారు. చరిత్రలో నిలిచేపోయే రోజున రామ నామ స్మరణ చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలని అభిషేక్ గౌడ్ పిలుపునిచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.