
ఎల్నినో ఎఫెక్ట్తో తెలంగాణలో కూరగాయల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా జూన్ నెలలో కురవాల్సిన వర్షాలు ఈసారి జాడ లేకపోవడంతో కూరగాయల సాగు తీవ్రంగా దెబ్బతింటోంది. నీటి కొరత, పెరిగిన సాగు ఖర్చులు, తగ్గిన దిగుబడి అంతా కలిపి కూరగాయల భోజనం చేయాలంటే సామాన్యుడి జేబు ఖాళీ అవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో కూరగాయల దిగుబడి గణనీయంగా పడిపోయింది. చిక్కుడు, టమాటా, బీన్స్, క్యాబేజీ లాంటి కూరగాయల ఉత్పత్తి తగ్గిపోయింది. వర్షాభావంతో చిక్కుడు పంటలు ఎండిపోతుండగా, టమాటా దిగుబడి కూడా పూర్తిగా పడిపోయింది. మొన్నటి వరకు హోల్సేల్ మార్కెట్లో 50 నుంచి 60 రూపాయల మధ్య ఉన్న టమాటా, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వస్తే తప్ప హైదరాబాద్ మార్కెట్లో దొరకని పరిస్థితి ఏర్పడింది. బీన్స్ రైతు బజార్లోనే కిలో 100 రూపాయలు ఉండగా, రిటైల్ మార్కెట్లో 150 నుంచి 180 రూపాయల వరకు అమ్ముడవుతోంది. చిక్కుడుకాయ కూడా రైతు బజార్లో 70 నుంచి 80 రూపాయలు ఉండగా, బయట మార్కెట్లో 150 రూపాయల వరకూ పలుకుతోంది.
రైతు బజార్లలో సరుకు లేకపోవడంతో మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. బోర్ నీళ్లనే వర్షం మాదిరిగా స్ప్రే చేస్తూ పంటలను బతికించే ప్రయత్నం చేస్తున్నామని రైతులు చెబుతున్నారు.
ఎల్నినో పరిస్థితులు వస్తాయని ఆరు నెలల కిందటే హెచ్చరికలు వచ్చాయని, అందుకే పంటల మార్పిడిపై దృష్టి పెట్టామని రైతులు చెబుతున్నారు. వేసిన పంటలు కూడా మొలకెత్తే పరిస్థితి లేదంటున్నారు.
ఒకప్పుడు తెలంగాణలో 5 లక్షల 52,000 ఎకరాల్లో పండిన కూరగాయలు 2025 సంవత్సరానికి 50,000 ఎకరాలకు పడిపోయింది. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాలు ఒకప్పుడు హార్టికల్చర్కు కేంద్రంగా ఉండేవి. కానీ రియల్ ఎస్టేట్ విస్తరణతో కూరగాయల సాగు క్రమంగా తగ్గిపోయిందని రైతు కమిషన్ సభ్యులు చెబుతున్నారు..
ప్రభుత్వం కూడా కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు ప్రారంభించిందని అంటున్నారు. యాచారం మండలంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కూరగాయల సాగు విస్తీర్ణం మూడు రెట్లు పెరిగినట్లు రైతు కమిషన్ మెంబర్లు చెబుతున్నారు.
ఎల్నినో పరిస్థితులతో.. దిగుబడి తగ్గడంతో పాటు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూరగాయల దిగుమతులు తగ్గి.. కొరత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. రాబోయే రెండు మూడు నెలల్లో కూరగాయల ధరలు మరింత భగ్గుమనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..