Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఆదాయంపై కరోనా పంజా.. తగ్గిన ప్రయాణికులు.. తెరుచుకోని దుకాణాలు!

|

Jul 03, 2021 | 4:50 PM

హైదరాబాద్ నగరానికి ప్రతిష్ట తీసుకువచ్చేలా తీర్చిదిద్దిన మెట్రో రైలు గత ఏడాదిన్నర కాలంగా నష్టాలలో చిక్కుకుంది. మెట్రో స్టేషన్లలోని మెట్రో మాల్స్‌ కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఆదాయంపై కరోనా పంజా.. తగ్గిన ప్రయాణికులు.. తెరుచుకోని దుకాణాలు!
Hyderabad Metro
Follow us on

Hyderabad Metro station shopping malls: హైదరాబాద్ నగరానికి ప్రతిష్ట తీసుకువచ్చేలా తీర్చిదిద్దిన మెట్రో రైలు గత ఏడాదిన్నర కాలంగా నష్టాలలో చిక్కుకుంది. లాక్ డౌన్ కారణంగా ప్రయాణీకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో పాటు మెట్రో స్టేషన్లలోని మెట్రో మాల్స్‌ కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. కరోనా కారణంగా గత ఏడాది మార్చిలో మొదలైన మెట్రో మాల్స్ కష్టాలు ప్రస్తుతం మరింత పెరిగాయి.

హైదరాబాద్ మెట్రో రైల్‌ను కరోనా వైరస్ దారుణంగా దెబ్బ తీసింది. దేశంలోనే రెండో అతి పెద్ద మెట్రో సంస్థగా గుర్తింపు పొందుతూ 2017 నవంబర్ 29న ప్రారంభమైన మెట్రో.. రెండేళ్ల పాటు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమైంది. మెట్రోలో షాప్స్ ప్రారంభమైన తర్వాత కొంత వరకూ ఆర్ధిక ఇబ్బందులు తొలగాయి. అదే సమయంలో ప్రయాణీకుల సంఖ్య కూడా పెరగడంతో నష్టాలు తగ్గి లాభాల బాట పట్టింది. కరోనా ప్రభావం కనిపించక ముందు వరకూ మెట్రో నిర్వహణతో పాటు ప్రయాణీకులు, మాల్స్ లో కొనుగోలుదారులతో కిటకిటలాడిన మెట్రో స్టేషన్లు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. ఓవైపు ప్రయాణీకులు తగ్గడం, మరోవైపు, మెట్రో స్టేషన్లలో నెలకు వేలాది రూపాయల అద్దె చెల్లిస్తూ ఏర్పాటు చేసిన షాపుల్లో ఆశించిన గిరాకీ రాకపోవడంతో నిర్వాహకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్ నగరంలోని మెట్రో కారిడార్ల పరిధిలోని 57 స్టేషన్ల గుండా రోజూ 55 రైళ్ల ద్వారా వెయ్యి ట్రిప్పులు నడిపిస్తున్నారు. కరోనా ప్రభావం లేకముందు ఆయా కారిడార్ల పరిధిలో రోజు 4లక్షల మంది ప్రయాణం సాగించారు. మాయదారి కరోనా దాపురించాక, మెట్రో సేవలను కుదించారు. లాక్‌డౌన్ ఎత్తవేశాక ప్రయాణ సర్వీసులను సడలించినప్పటికీ అశించిన స్థాయిలో ప్రయాణికులు రావడంలేదు. కనీసం రోజుకు లక్షమంది కూడా దాటడంలేదు. ప్రస్తుతం 80 వేల మంది మాత్రమే మెట్రోను ఆశ్రయిస్తున్నారు.

కరోనా మొదటి దశ లాక్‌డౌన్‌లో భాగంగా మార్చి 23 నుంచి నిలిచిపోయిన రైళ్లు సెప్టెంబర్‌ 7 నుంచి పట్టాలపైకి వచ్చాయి. అప్పటి నుంచి ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు మెట్రో రైలు సంస్థ టికెట్లపై రాయితీలు అందుబాటులోకి తీసుకురావడంతో రోజుకు 2లక్షల లోపు ప్రయాణికులు ప్రయాణించారు. అయితే, కోవిడ్‌ రెండో దశ మెట్రోపై మరోసారి పంజా విసిరింది. మూడు నెలల పాటు కొనసాగిన రెండో దశ ప్రభావం మెట్రోను భారీగా దెబ్బ తీసింది. రెండో దశ లాక్‌డౌన్‌ ఎత్తేసినా మెట్రో మాత్రం ఆర్ధిక కష్టాల నుంచి కోలుకోలేకపోతోంది.

ఇదిలావుంటే, హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ పలు స్టేషన్లలో మూడేళ్ల కిందట 8 ఏళ్ల టెండర్‌ ప్రాతిపదికన దుకాణాలను లీజ్‌కు ఇచ్చింది. అంతేకాదు, పంజాగుట్ట, ఎర్రమంజిల్‌, హైటెక్‌సిటీ, మూసారాంబాగ్‌ మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా భారీ మాల్స్‌ ప్రారంభించారు. కరోనాకు ముందు ఆయా స్టేషన్లలోని షాపుల్లో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు రద్దీ కనిపించేది. కానీ, కరోనా వైరస్ ప్రభావంతో మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో అమీర్‌పేట్‌, హైటెక్‌సిటీ, పంజాగుట్ట, మాదాపూర్‌, రాయదుర్గం, తదితర స్టేషన్లలోని చిన్న చిన్న దుకాణాలు మూతపడ్డాయి. ఉదయం నుంచి రాత్రి వరకు షాపులు తెరిచి ఉంచినా పలు సందర్భాల్లో ఉట్టిచేతులతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో వ్యాపారం తగ్గిపోయినా కిరాయిలు చెల్లించాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకుని అద్దె చెల్లింపుల్లో రాయితీలు కల్పించినట్లయితే మెట్రో స్టేషన్ల వ్యాపారులకు వెసులుబాటుగా ఉంటుందని వ్యాపారులు అంటున్నారు.

Read Also…. Pushkar Singh Dhami: ఉత్తరాఖండ్‌ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌ సింగ్‌ ధామి.. ఏకగ్రీవంగా ఎన్నికున్న లెజిస్లేచర్ పార్టీ