
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5వ తేదీన సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ క్రేజీ మ్యాచ్ కోసం ఇప్పటికే హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఆన్లైన్లో టికెట్ సేల్స్ పెట్టిన గంటలోపే.. టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. దీంతో చాలామంది అభిమానులకు టికెట్లు దొరకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. అయితే ఇప్పుడు ఇదే అదునుగా చేసుకున్న సైబర్ ఫ్రాడ్స్టర్లు అభిమానుల ఆశను దోచుకునే పనిలో పడ్డారు.
సోషల్ మీడియాలో ఐపీఎల్ టికెట్ల విక్రయం పేరుతో కొన్ని ప్రత్యేక పేజీలను ఏర్పాటు చేశారు. ఈ పేజీల ద్వారా టికెట్లు కావాలంటే సంప్రదించాల్సిందిగా కొన్ని వాట్సాప్ నెంబర్లను సైతం అందులో ప్రచురించారు. ఇది నిజమేమోననుకుని నమ్మిన అభిమానులు ఆ వాట్సాప్ నంబర్తో చాట్ చేస్తున్నారు. 3500 ఐపీఎల్ టికెట్కు డిస్కౌంట్ కూడా ఇస్తామని అభిమానులను నమ్మిస్తున్నారు. రెండు టికెట్లు కావాలంటే వెంటనే పంపిన క్యూఆర్ కోడ్కి డబ్బులు చెల్లించాల్సిందని చెబుతున్నారు. క్రికెట్ మీద ఆశతో నిజంగానే టికెట్లు వస్తాయేమో అని ఆశపడుతున్న అభిమానులకు చివరిగా నిరాశ మిగులుతోంది. క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు స్కాన్ చేసి ఆ స్క్రీన్ షాట్ను సంబంధిత వాట్సాప్ నెంబర్కు పంపిన తర్వాత ఆ నంబర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయామని గ్రహిస్తున్నారు బాధితులు. ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.
ఐపీఎల్ మ్యాచ్లకు ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని సైబర్ నేరగాళ్లు ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, ముంబై లాంటి జట్లు ఆడే మ్యాచ్లకు ఫ్యాన్స్ క్రేజ్ విపరీతంగా ఉన్న తరుణంలో.. ఆన్లైన్లో టికెట్లు దొరకడం కాస్త కష్టంగా మారింది. టికెట్లను కేవలం పేటీఎం సైట్లో మాత్రమే కొనుక్కోవాల్సిందిగా అభిమానులకు పోలీసులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ప్రకటనలను చూసి మోసపోవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అలాంటి ప్రకటనలు చూస్తే వెంటనే తమకు సమాచారం అందించాల్సిందిగా పోలీసులు కోరారు.