
హైదరాబాద్లో భారీ మోసం బట్టబయలైంది. ఆస్ట్రేలియాలో నాలుగు పబ్బుల యజమాని అంటూ, పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉన్నట్టు నటించి ఓ వ్యాపారిని రూ.1.38 కోట్లకు మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ వరప్రసాద్ అనే వ్యక్తి తనను ఆస్ట్రేలియా పౌరుడిగా, మెల్బోర్న్లో నాలుగు పబ్బులు నడుపుతున్న వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్నాడు. తమిళనాడులో మద్యం తయారీ యూనిట్ స్థాపిస్తున్నానని, పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించాడు. మాదాపూర్లో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ సంస్థ పేరుతో కార్యాలయం ప్రారంభించి వ్యాపార వర్గాల్లో పరిచయాలు పెంచుకున్నాడు. ఈ క్రమంలో ముసారాంబాగ్కు చెందిన వ్యాపారి నరేందర్ రెడ్డితో స్నేహం పెంచుకుని తన ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టమని ఒప్పించాడు. స్టూడియోలు నిర్మిస్తున్నానని కూడా చెప్పాడు. ఈ హామీలతో నరేందర్ రెడ్డి పలు విడతల్లో రూ.1.38 కోట్లు పెట్టుబడి పెట్టారు.
కొంతకాలానికి వరప్రసాద్ ఫోన్లకు స్పందించకుండా తప్పించుకోవడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. ఇంటికి వెళ్లగా విదేశాలకు వెళ్లిపోయాడని సమాచారం అందింది. తిరిగి వచ్చాక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తానని హామీ ఇచ్చినా, ఆ ఫ్లాట్ అతనిదే కాదని తేలింది. ఇతరులనూ ఇలానే మోసం చేసినట్టు బాధితుడు గుర్తించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, రౌడీ షీటర్లతో బెదిరింపులకు దిగినట్టు సమాచారం. ఈ ఏడాది జనవరిలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు లుక్అవుట్ నోటీసు జారీ చేశారు. ఇటీవల శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద అతడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా.. జడ్జి రిమాండ్ విధించారు. ఈ కేసులో సంబంధం ఉన్న ముగ్గురు బంధువులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. మరెవరైనా బాధితులు ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని సీసీఎస్ డీసీపీ చైతన్య కుమార్ విజ్ఞప్తి చేశారు.