
ఖమ్మం, జులై 21: కుటుంబంలో వచ్చిన గొడవలతో ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లి ఆ గ్రామంలోనే నివాసం ఉంటున్న భార్యపై కోపం పెంచుకున్న భర్త ఉన్మాది గా మారాడు పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తితో ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే భార్య పై దాడి చేశాడు.
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం ఎర్రబోడు తండాకు చెందిన భూక్య రాంబాబు, తన భార్య రజినిపై కత్తితో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గత రెండు సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో రజిని తన పుట్టిల్లు సాతానిగూడెం గ్రామంలో ఉంటోంది. ఇదిలా ఉండగా, డ్వాక్రా సంఘం ద్వారా తీసుకున్న రుణం చెల్లించాలని సంఘ సభ్యులు ఒత్తిడి చేయడంతో రజినిని ఏన్కూరులోని ఎస్బీఐ బ్యాంకుకు తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న భర్త రాంబాబు బ్యాంకు వద్దకు వచ్చి రజినితో ఘర్షణ పెట్టుకున్నాడు. ఇదే సమయంలో అంతకుముందు రజిని కుమార్తె తన తల్లిపై ఏన్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, విచారణ నిమిత్తం పోలీసులు రజినిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
పోలీస్ స్టేషన్కు రజిని వెళ్లడాన్ని గమనించిన రాంబాబు పోలీస్ స్టేషన్ కు చేరుకుని తన వద్ద ఉన్న కత్తితో ఒక్కసారిగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. రజిని ఎడమ భుజం, ఎడమ చేతి మణికట్టు భాగంలో కత్తితో పొడవడంతో తీవ్ర రక్తస్రావమైంది. బాధతో ఆమె కేకలు వేయగా, అక్కడున్న పోలీసులు, స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఏన్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి గల పూర్తి కారణాలు, కుటుంబ వివాదాలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటనతో ఏన్కూరు పోలీస్ స్టేషన్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భర్త భూక్యా రాంబాబు పై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు.