High Court: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు రద్దు చేయలేం.. స్పష్టం చేసిన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్
Telangana municipal elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను నిలిపివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి.
Telangana municipal elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను నిలిపివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు రద్దుచేయాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్లో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలైంది. కాంగ్రెస్ నేత షబ్బీర్అలీ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని షబ్బీర్ అలీ తన పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేసిందని … ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోరారు.
కాగా లంచ్ మోషన్ పిటిషన్ను విచారించేందుకు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నిరాకరించారు. ఎన్నికల కమిషన్కు మరోసారి విన్నవించాలని పిటీషనర్కు చీఫ్ జస్టిస్ సూచించారు. ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను ఆపలేమని చెప్పడంతో డివిజన్ బెంచ్లో పిటీషన్ దాఖలు చేశారు. అయితే, లంచ్ మోషన్ అనుమతి ఇవ్వకపోవడంతో రెగ్యులర్ పిటీషన్ను షబ్బీర్ అలీ వేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే గతంలోనే సింగిల్ బెంచ్.. ఎన్నికల ప్రక్రియ మొదలైన కారణంగా తాము ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ అంశంపై పిటిషనర్ ఇచ్చిన అభ్యర్ధనను ఈసీ పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. ఇక, తాజాగా హైకోర్టు తీర్పుతో తెలంగాణలో ఈనెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి.