చిన్నారుల్లో దంత సమస్యలకు చెక్.. కేసవరం స్కూల్లో ప్రాజెక్ట్ హెల్తీ స్మైల్స్ – హెల్తీ ఫ్యూచర్స్
స్కూల్ పిల్లల దంత ఆరోగ్యం, రక్తహీనత నివారణే లక్ష్యంగా కేశవరం జెడ్పీ హైస్కూల్లో ఉచిత ఆరోగ్య శిబిరం కొలువుదీరింది. HBL ఇంజనీరింగ్ లిమిటెడ్ సౌజన్యంతో రోహిణి ఫౌండేషన్ చేపట్టిన ప్రాజెక్ట్ హెల్తీ స్మైల్స్ - హెల్తీ ఫ్యూచర్స్ కార్యక్రమాన్ని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ శుక్రవారం ప్రారంభించి, చిన్నారుల కోసం రూపొందించిన ఓరల్ హైజీన్ పోస్టర్ను ఆవిష్కరించారు.

చిన్నారుల్లో చిన్న వయస్సు నుంచే నోటి పరిశుభ్రత అలవాట్లు పెంపొందించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే అనేక దంత సమస్యలను నివారించవచ్చని మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవరం జెడ్పీ స్కూల్లో హెచ్బీఎల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల సహకారంతో రోహిణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ హెల్తీ స్మైల్స్ – హెల్తీ ఫ్యూచర్స్ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా 3 నుండి 6 సంవత్సరాల చిన్నారుల కోసం రోహిణి ఫౌండేషన్ ప్రత్యేకంగా రూపొందించిన ఓరల్ హైజీన్ ఇన్స్ట్రక్షన్స్ పోస్టర్ను అడిషనల్ కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులలో నోటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, దంత సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందించడం వల్ల ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మించవచ్చని తెలిపారు.
ప్రాజెక్ట్ లక్ష్యాలు – వైద్య పరీక్షలు
రోహిణి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.చెరుకు సంపత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా దంత పరీక్షలు, సాధారణ హెల్త్ టెస్టులు, హీమోగ్లోబిన్ పరీక్షలు, నోటి ఆరోగ్య అవగాహన – పోషకాహార సలహాలు అందిస్తున్నట్లు వివరించారు. చిన్నారుల్లో రక్తహీనతను నివారించడం, దంత వ్యాధులను ముందే గుర్తించి చికిత్స అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఫౌండేషన్ సభ్యురాలు డా. విమల విద్యార్థులకు దంతాలను రోజుకు రెండుసార్లు తోముకునే సరైన విధానం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు.
ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రశంసలు
మూడుచింతలపల్లి మున్సిపల్ చైర్మన్ జాము రవి, కమిషనర్ వెంకట గోపాల్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం HBL సంస్థ, రోహిణి ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ రకమైన ఆరోగ్య శిబిరాలు విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు.
