Telangana: ఇల్లు లేని వారికి, ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూనియర్ కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 2027 గోదావరి పుష్కరాల కోసం రూ.1000 కోట్ల కేటాయింపుతో పాటు తొలివిడతగా రూ.300 కోట్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఆమోదం తెలిపింది. అలాగే.. గంగాధర డిగ్రీకాలేజ్కు 29 పోస్టులకు ఆమోదం తెలిపింది. కేసముద్రం ఫైర్ స్టేషన్కు 18 పోస్టుల మంజూరు.. 2027 గోదావరి పుష్కరాలకు వెయ్యి కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలివిడతగా రూ.300 కోట్లు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. BSF, CISF గ్రూప్ సెంటర్లకు తెలంగాణలో భూములు కేటాయిస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ వెలిదిలో 4 ఎకరాలు, రుక్మాపూర్లో 5 ఎకరాలు.. గన్నేరువరంలో 5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. HILT పాలసీ విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్లో విడుదల చేసినట్లు తెలిపారు. ORR పరిధిలో 9వేల 292 ఎకరాల పరిశ్రమల భూముల మార్పిడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. పాత ఇండస్ట్రీయల్ ల్యాండ్స్కు మల్టీ-యూజ్ జోన్ హోదా, ఐటీ పార్కులు, నివాస ప్రాజెక్టులు, కమర్షియల్ కాంప్లెక్స్లకు వాడేలా అవకాశం కల్పించనున్నారు. ఆసుపత్రులు, విద్యాసంస్థల ఏర్పాటుకు కూడా HILT పాలసీతో వెసులుబాటు కల్పించనున్నారు.
పరిశ్రమల యజమానులతో ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు కీలక సమావేశం నిర్వహించనున్నారన్నారు. పాలసీ అమలుపై పరిశ్రమల యజమానుల అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించనుంది. ఈ మేరకు HILT పాలసీపై సలహాలు సూచనలకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.
జూన్ 1 నుంచి ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రారంభం
జూన్ 1 నుంచి ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రారంభం అవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రెండో విడతలో నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లు ఇస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న 500 ఇళ్లకు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. స్థలాలు ఉన్నవారికి రూ.5 లక్షల కేటాయింపు జరుపుతున్నామని.. మూడు, నాలుగు విడతలుగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పొంగులేటి తెలిపారు.
