
రాష్ట్రంలో గురుకుల డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. జూనియర్ కళాశాలల్లో 2,008 పోస్టులు, డిగ్రీ కళాశాలల్లో 868 పోస్టులకు సమగ్ర ఉద్యోగ ప్రకటనలను రాష్ట్ర గురుకుల బోర్డు వెబ్సైట్లో పొందుపరిచింది. అయితే ఆన్లైన్ దరఖాస్తుకు మే 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువుగా ఉంది. మొత్తం 2,876 పోస్టుల భర్తీకి విడుదల చేసిన ఈ ప్రకటనల్లో 2,301 పోస్టులు మహిళలకే రిజర్వు అయ్యాయి. అంటే దాదాపు 80 శాతం వారికే అవకాశాలున్నాయి.
అలాగే జనరల్ కింద పేర్కొన్న మిగిలిన పోస్టులకు పురుషులతో పాటు మహిళలూ పోటీపడవచ్చు. అయితే గురుకులాల నిబంధనల మేరకు మహిళా విద్యాసంస్థల్లోని పోస్టులకు మహిళలే అర్హులు కావడంతో వారికి మరింత ప్రయోజనం చేకూరనుంది. అలాగే ఎస్సీ గురుకుల సొసైటీలో డిగ్రీ కళాశాలలన్నీ కూడా మహిళలవే కావడం గమనార్హం. అయితే ఈ విద్యాసంస్థల్లో పోస్టుల భర్తీకి ప్రత్యేక రోస్టర్ను అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు. పరీక్షల షెడ్యూలును కూడా త్వరలోనే వెబ్సైట్లో పొందుపరుస్తామని గురుకుల బోర్డు తెలిపింది. పరీక్షలను ఓఎంఆర్ పద్ధతిలో లేదా ఆన్లైన్లో నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొంది. పరీక్ష తేదికి వారం రోజుల ముందు హాల్టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని సూచించింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..