
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పల్కపల్లిలో గ్రామంలో గంజాయి మొక్కల సాగు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు అచ్చంపేట పోలీసులు తనిఖీలు నిర్వహించగా విస్తుపోయారు. ఇంటి పెరట్లో రహస్యంగా గంజాయి మొక్కల సాగును చూసి ఆశ్చర్యపోయారు. సుమారు 5 కిలోల 18 గంజాయి మొక్కలను గుర్తించారు. వాటిని తొలగించి నాగనూలు మధు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
పల్కపల్లి గ్రామానికి చెందిన మధు.. అచ్చంపేట పట్టణంలో ఎలక్ట్రిషియన్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మూడేళ్ల కిందట మధు గంజాయికి బానిసయ్యాడు. వచ్చిన సంపాదనలో ఎక్కువ భాగం గంజాయికే వెళ్తోంది. రహస్యంగా కొనుగోలు చేసే ఈ గంజాయి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో కొనుగోలు చేయలేక కొత్త ప్రణాళికకు తెరలేపాడు. ఇందుకోసం అమ్రాబాద్ మండలం మన్ననూర్, హైదరాబాద్లో గంజాయితో పాటు విత్తనాలను సేకరించాడు. రెండేళ్ల నుంచి ఇంటి వద్దే మొక్కలు పెంచుతున్నాడు. చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా గంజాయి మొక్కల చుట్టూ గ్రీన్ నెట్తో కనబడకుండా కవర్ చేశాడు. ఇక పెరుగుతున్న గంజాయిని తెలిసిన వ్యక్తులకు విక్రయించడం, వారితో కలిసి మధు తాగేవాడు. ఈ క్రమంలో పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వెంటనే మధు ఇంటి వద్దకు వెళ్ళి సోదాలు చేశారు. పెరట్లో పెంచుతున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి