
మొన్న ఆపరేషన్ ఆక్టోపస్.. ఇప్పుడు ఆపరేషన్ క్రాక్డౌన్ పేరుతో సైబర్ నేరస్థుల పని పడుతున్నారు తెలంగాణ పోలీసులు. ఇటీవల 16 రాష్ట్రాల్లో భారీ ఆపరేషన్ చేపట్టిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్.. ఇప్పుడు సొంత స్టేట్పై గుర్తిపెట్టింది. మ్యూల్ అకౌంట్స్పై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా ప్యాన్ ఇండియా ఆపరేషన్ నిర్వహించింది తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ వింగ్. ఏకకాలంలో 16 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి.. అతిపెద్ద సైబర్ క్రైమ్ ముఠాను పట్టుకున్నారు. ఆక్టోపస్ పేరుతో నిర్వహించిన ఈ ఆపరేషన్లో వందమందికి పైగా సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు.
ఆక్టోపస్ పేరుతో నిర్వహించిన ఈ ఆపరేషన్లో హైదరాబాద్ కేంద్రంగా మ్యూల్ అకౌంట్స్ బండారం బయటపడింది. నకిలీ వ్యాపార సంస్థల పేర్లతో మ్యూల్ బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ మోసాలకు పాల్పడుతున్న వారి గుట్టుర్టైంది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో జూబ్లీహిల్స్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కు చెందిన బ్రాంచ్ మేనేజర్, సేల్స్ మేనేజర్ కూడా ఉన్నారు. వారితో పాటు మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ టి. సాయి మనోహర్ తెలిపారు. విచారణలో అసలు సంచలన విషయాలు వెల్లడయ్యాయన్నారు.
హైదరాబాద్ పాతబస్తీ పహాడీ షరీఫ్కు చెందిన జవ్వాద్ ఖాద్రీ రిఫాయి, మహమ్మద్ నౌషాద్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలను సమకూర్చేందుకు పథకం పన్నారు. ఇందులో భాగంగా ఒక షట్టర్ను అద్దెకు తీసుకుని, ‘స్టార్ అగ్రో ఇండస్ట్రీస్’ పేరుతో నకిలీ అద్దె ఒప్పందాలు, తప్పుడు వ్యాపార పత్రాలను సృష్టించారు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా జూబ్లీహిల్స్ మర్కంటైల్ కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సేల్స్ మేనేజర్ పాముల ప్రణవరాజ్, బ్రాంచ్ మేనేజర్ శంకర్ రాథీ సహకారంతో కరెంట్ ఖాతా ప్రారంభించారు. ఖాతా తెరిచిన వెంటనే నకిలీ కంపెనీకి ఏటీఎం కార్డు, చెక్ బుక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలతో పాటు సిమ్ కార్డును కూడా సైబర్ మోసగాళ్లకు అప్పగించారు. దీంతో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డట్లు డీసీపీ టి. సాయి మనోహర్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా అక్టోబర్ 2025లో ఈ ఖాతా ద్వారా సుమారు రూ. 6.67 లక్షల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. నిందితులు పరారీలో ఉండగా, ఫిబ్రవరి 26, 2026న పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
సైబర్ క్రైమ్స్ పోలీసు విచారణలో.. సదరు బ్యాంకు శాఖలోనే దాదాపు 30కి పైగా మ్యూల్ ఖాతాలు తెరిచినట్లు నిందితులు అంగీకరించారు. ఈ ముఠా వెనుక ఉన్న ఇతర సభ్యులను, బాధితుల వివరాల కోసం దర్యాప్తు చేస్తామని డీసీపీ చెప్పారు. డబ్బు కోసం బ్యాంక్ ఖాతాలు, కేవైసీ పత్రాలను ఇతరులకు ఇవ్వడం తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్కు లేదా cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ డీసీపీ టి. సాయి మనోహర్ సూచించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..