సార్సాల అటవీ అధికారులపై దాడి కేసులో సంచలన తీర్పు.. 7 ఏళ్ల తర్వాత జైలు శిక్ష విధించిన కోర్టు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సార్సాల అటవీ అధికారులపై దాడి కేసులో ఏడేళ్ల తర్వాత తుది తీర్పు వెలువడింది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఎనిమిది మంది నిందితులను దోషులుగా తేల్చింది ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం. ముద్దాయిలకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మరో 31 మంది నిందితులకు కేసు నుంచి ఉపశమనం లభించింది.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సార్సాల అటవీ అధికారులపై దాడి కేసులో ఏడేళ్ల తర్వాత తుది తీర్పు వెలువడింది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఎనిమిది మంది నిందితులను దోషులుగా తేల్చింది ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం. ముద్దాయిలకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మరో 31 మంది నిందితులకు కేసు నుంచి ఉపశమనం లభించింది.
2019 జూన్ 30న కాగజ్నగర్ మండలం కొత్త సార్సాల గ్రామంలో హరితహారం కార్యక్రమం చేపట్టారు అధికారులు. ఇందులో భాగంగా అటవీ భూమిలో మొక్కలు నాటేందుకు భూమిని చదును చేసేందుకు అటవీ అధికారులు వెళ్లారు. అప్పటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చోళ అనిత నేతృత్వంలోని బృందాన్ని గ్రామస్థులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో అటవీ అధికారులపై కొందరు వ్యక్తులు కర్రలతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎఫ్ఆర్వో అనితతో పాటు పలువురు అధికారులు గాయపడ్డారు. అప్పట్లో ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అప్పటి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారని ఆరోపణలు నమోదయ్యాయి.
ఎఫ్ఆర్వో అనిత ఫిర్యాదు మేరకు కాగజ్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు మొత్తం 39 మందిని నిందితులుగా గుర్తించి హత్యాయత్నం, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, దాడి తదితర అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. డీఎస్పీ సత్యనారాయణ దర్యాప్తు అనంతరం 2020లో కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 300 మందికి పైగా సాక్షులను విచారించిన న్యాయస్థానం, ఆధారాలను పరిశీలించిన అనంతరం ఎనిమిది మందిని దోషులుగా నిర్ధారించింది. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణతో పాటు భూరం పోసం, పుల్ల శ్రీకాంత్, కొట్ట మల్లేష్, బొబ్బర శంకర్, రాజశేఖర్, భూరం మల్లేష్, బచ్చే శ్యామలకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
ఏడేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం వెలువడిన ఈ తీర్పుతో అటవీ శాఖ అధికారులకు న్యాయం జరిగిందని అధికారులు, సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారులపై దాడులను సహించబోమనే సందేశాన్ని ఈ తీర్పు ఇస్తుందని పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
