కర్ణాటకలో ఎన్నిక ఫలితాల ఎఫెక్ట్.. తెలంగాణలో మెల్లమెల్లగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఆ పార్టీ జోరు పెంచుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఘర్వాపసీ పాలిటిక్స్కు పునాది పడినట్టు తెలుస్తోంది. క్షణికావేశంలో పార్టీని వీడినవారంతా మళ్లీ రావాలంటూ రేవంత్ రెడ్డి బహిరంగంగా పిలుపునిచ్చారు. నన్ను తిట్టినా పర్లేదు.. తెలంగాణకోసం కలిసి పనిచేద్దామంటూ.. వివేక్, రాజగోపాల్రెడ్డి, కొండావిశ్వేశ్వర్రెడ్డి వంటి కీలక నేతలను రేవంత్ ఆహ్వానించడం చర్చనీయమైంది.
కాంగ్రెస్ పార్టీ పనైపోయిందనుకుని దూరంగా జరిగినవాళ్లంతా ఇప్పుడు మళ్లీ హస్తం వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు.. టీమ్వర్క్గా పనిచేస్తే విజయం సాధించడం పెద్ద విషయం కాదనే తత్వం కర్ణాటక ఎన్నికలతో బోధపడినట్లు స్పష్టమవుతోంది. నాలుగు మెట్లు దిగేందుకు తాను సిద్ధమంటూ తాజాగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆ కోవలోకే వస్తాయ్. ఏడాది క్రితం పార్టీ వీడి.. బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి తనకు ఆహ్వానం ఉన్నమాట వాస్తమేనంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తే.. ఇప్పుడు రేవంత్ చెప్పిన మాటలు దానికి మరింత బలాన్నిచ్చాయ్. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఇలా అంటే.. అన్న వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు సైతం అలానే ఉన్నాయి. సీఎం పదవి రేసులో తాను లేనంటూ.. నిన్ననే స్పష్టం ఇచ్చారు వెంకట్రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్లో వర్గపోరు లేదనీ.. తామంతా కలిసే ఉన్నామనీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..