Telangana: తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు.. లక్షల విలువైన ESI మెడిసిన్ వారి వద్ద
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మెరుపు దాడులకు దిగారు. తనిఖీల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పలు మెడికల్ షాపులకు హెచ్చరికలు జారీ చేశారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు అక్రమార్కులపై కొరడా ఝులిపించారు. మెడికల్ షాపుల్లో నిరంతర దాడులు నిర్వహిస్తూ… అక్రమ నిల్వలతోపాటు అధిక ధరలకు మందులు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. తాజాగా నిర్వహించిన తనిఖీల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలో 9 ప్రాంతాల్లో సోదాలు జరిపిన అధికారులు.. పలు మెడికల్ షాపుల్లో అక్రమ నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఈఎస్ఐ హస్పటల్ మెడిసిన్స్ అక్రమ మార్గంలో మెడికల్ స్టోర్స్కు తరలిస్తున్నట్లు సోదాల్లో తేలింది. కరీంనగర్ శ్రీనివాస మెడికల్ స్టోర్లో 4.87లక్షల ఈఎస్ఐ మెడిసిన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మురిళీరావు అనే ఈఎస్ఐ డిస్పెన్సరి ఉద్యోగి చేతివాటం తెలుస్తోంది.
ఇక బైంసాలో లైసెన్స్ లేకుండా మెడిసిన్స్ విక్రయిస్తున్న దుకాణాలపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు చర్యలకు సిద్ధమైయ్యారు. మరోవైపు సికింద్రాబాద్ వారసిగూడ భార్గవి మెడికల్ స్టోర్స్లో 54 రకాల గడువు ముగిసిన మెడిసిన్స్ను స్వాధీనం చేసుకున్నారు. మలక్పేట్లో నిషేధిత న్యూట్రేషన్ మెడిసిన్ను సీజ్ చేశారు. ఈ నెల 15 నుంచి 22వరకు జరిగిన దాడుల్లో 9.15లక్షల మెడిసిన్స్ సీజ్ చేశారు అధికారులు. ఇటీవల కొన్ని మెడికల్ షాపుల్లో కొన్ని రకాల మందుల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ఈ విషయంపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించారు. అక్రమంగా మందులు అమ్మకాలు జరిపితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




