Dharmapuri Arvind: తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే: ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు
Dharmapuri Arvind: తెలంగాణలో కాంగ్రెస్కు బీజేపీయే సరైన ప్రత్యామ్నాయం.. రాష్ట్రంలో జాతీయవాదం డామినేట్ చేస్తోందని, బీజేపీ ఓటు శాతం పెరుగుతోందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలో పార్టీ బలంగా ఉందని, ఇతర ప్రాంతాల్లోనూ విస్తరణ జరుగుతోందని తెలిపారు. ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడం రాజకీయ ప్రక్రియలో భాగమని..

Dharmapuri Arvind: తెలంగాణ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎదుగుదల, దాని భవిష్యత్తుపై బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్ TV9 తెలుగు క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీయే బలమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ప్రజలు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణను వామపక్ష భావజాల నేలగా అభివర్ణించడాన్ని అరవింద్ ఖండించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జాతీయవాదం బలంగా ఉందని, గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రజలు జాతీయవాదానికి ఓటు వేస్తున్నారని ఆయన వాదించారు. తన గణాంకాల ప్రకారం, 2019 లోక్సభ ఎన్నికలలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 44% ఓటర్లు జాతీయవాదం, హిందుత్వానికి మద్దతు పలికారని, ఇది ఇప్పుడు 55-60%కు పెరిగిందని అరవింద్ తెలిపారు.
బీజేపీ బలంపై మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణ (కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్)లో పార్టీకి మంచి పట్టు ఉందని అరవింద్ వివరించారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలలో రాజాసింగ్ మినహా మిగిలిన వారందరూ ఈ ప్రాంతం నుంచే వచ్చారని, నిజామాబాద్ పట్టణంలో రెండుసార్లు గెలిచామని గుర్తుచేశారు. అయితే, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, పశ్చిమ హైదరాబాద్, మెదక్ వంటి ప్రాంతాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలను వెతకాల్సిన పరిస్థితి ఉందని ఆయన అంగీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే ప్రక్రియ కొనసాగుతోందని, దీనిలో భాగంగా అభ్యర్థులను గుర్తించడం, ఇంపోర్ట్ చేసుకోవడం లేదా ప్లాంట్ చేయడం వంటి రాజకీయ ప్రక్రియలుంటాయని తెలిపారు.
ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడం (ఫిరాయింపులు)పై వస్తున్న విమర్శలను అరవింద్ తిప్పికొట్టారు. ఫిరాయింపులు కాదని, ఇతర పార్టీల నుండి వచ్చి తమ పార్టీలో చేరడం అని ఆయన స్పష్టం చేశారు. నాయకులకు తమ పార్టీలో స్థానం ఉంటుందని, వారిని సరైన రీతిలో వినియోగించుకుని ప్రజలలోకి పార్టీని తీసుకెళ్లడానికి కృషి చేస్తామని అన్నారు. అయితే, పార్టీలో చేరిన వారికి సరైన స్థానం లభించడం లేదనే విమర్శలను ప్రస్తావించగా, లోకల్ లీడర్షిప్ ఈ విషయంలో విఫలమై ఉండవచ్చని ఒప్పుకున్నారు.
బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుటుంబానికి దగ్గరైన వ్యక్తులను బీజేపీలోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారాన్ని ఆయన పదేళ్లుగా వింటున్న మాటలుగా కొట్టిపారేశారు. ఒక్క నాయకుడిని చేర్చుకోవడం వల్ల మొత్తం ఎన్నిక గెలుస్తామనే ఆలోచన లేదని, ప్రతి నియోజకవర్గంలోనూ వ్యక్తిగతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంపై మాట్లాడుతూ, 2014 తర్వాత ఆయన్ని అభినందించిన 90% మంది ఇప్పుడు అన్ఫాలో చేశారని, ఆయన ప్రభావం తగ్గిందని అరవింద్ అభిప్రాయపడ్డారు. బీజేపీలో అందరినీ ఐక్యంగా నడిపించే నాయకులు ఉన్నారా లేదంటే బయటి నాయకత్వం అవసరమా అనే ప్రశ్నకు, ఇది ఏ రాష్ట్రంలోనూ కొత్త కాదని, ఢిల్లీ నుంచి నాయకత్వం వచ్చి పార్టీని సమన్వయం చేయడం జరుగుతుందని గతంలో గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ లో ఇదే పని చేశారని గుర్తుచేశారు.
చివరగా, తెలంగాణలో కాంగ్రెస్కు బీజేపీ ప్రత్యామ్నాయమా అనే ప్రశ్నకు, ప్రజల అభిప్రాయం ప్రకారం మెజారిటీ ప్రజలు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని అరవింద్ పేర్కొన్నారు. బీఆర్ఎస్, కేసీఆర్ లకు పదేళ్లు అవకాశం ఇచ్చారని, ఇప్పుడు ప్రజలు వారిని తిరస్కరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ గత సాధారణ ఎన్నికలు గెలవడం ఒక ఆశ్చర్యమని, బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగకపోవడమే కాంగ్రెస్ అదృష్టమని ధర్మపురి అరవింద్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
