
తేమశాతం తగ్గించడం కోసం తెల్ల బంగారాన్ని ఆరబెట్టిన ఆ రైతుకు చివరకు బూడిద మిగిలింది. ఆకస్మాత్తుగా విద్యుత్ షాక్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు పత్తంతా అగ్నికి ఆహుతి అయ్యేలా చేశాయి. రెండు నిమిషాల వ్యవధిలోనే ఆ రైతు కుటుంబం రెక్కల కష్టం అంతా కాలి బూడిదైంది. ఆ సమయంలో ఆ రైతు తల్లి రోదనలు అందరి హృదయాలను చెలింపచేశాయి. ప్రకృతి విపత్తులను ఎదుర్కొని ఇంటికి చేర్చిన చివరకు విద్యుత్ ప్రమాదం రూపంలో అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ విచిత్ర అగ్నిప్రమాదం సంఘటన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం రామచంద్రుతండాలో జరిగింది. బాదావత్ శంకర్ అనే రైతు తన పొలంలో వేసిన పత్తిని తెంపి ఇంటికి తీసుకొచ్చాడు. మార్కెట్కు వెళితే తేమ ఉందని ఇబ్బందులు పెడతారని ఇంటి ముందు ఆరబెట్టాడు. ఆ పత్తి వద్ద రైతు తల్లి కాపలాగా కూర్చుంది.
షార్ట్ సర్క్యూట్తో ఆ పత్తికి మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే పత్తి అంతా కాలి బూడిదైంది. పత్తికి కాపలాగా ఉన్న ఆ మహిళ గట్టిగా కేకలు వేయగా ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలను ఆర్పేందుకు యత్నించారు. కానీ అప్పటికే పత్తి పూర్తిగా దగ్ధమై బూడిద మిగిలింది. రైతు ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో అగ్నిప్రమాద దృశ్యాలు రికార్డు అయ్యాయి. సుమారు రూ. 3 లక్షల వరకు పంట నష్టం జరిగిందని రైతు శంకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు..ప్రకృతి విపత్తులను ఎదుర్కొని ఇంటికి చేర్చిన రెక్కల ఇలా కాలి బూడిదవదంతో రైతు కుటుంబం అంతా తల్లడిల్లి పోతున్నారు.