CM KCR Public Meeting in Munugode Highlights: అందరి చూపు మునుగోడు వైపే. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో బైపోల్ అనివార్యమైన మునుగోడులో ఎలాగైనా పాగా వేయాలని ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. ఇవాళ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ప్రజాదీవెన పేరుతో సీఎం కేసీఆర్ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ కాన్వాయ్ మునుగోడు దారి పట్టింది. 4వేల భారీ కార్ల ర్యాలీతో సీఎం కేసీఆర్ మునుగోడు వెళుతున్నారు. బై పోల్ హీట్ను పెంచేలా కేసీఆర్ సభ ఉండబోతుంది అని తెలుస్తోంది.
ఉప్పల్ క్రాస్రోడ్ దగ్గర హైదరాబాద్ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. మంత్రి మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కేసీఆర్కు వెల్కమ్ పలికారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్తో సీఎం కేసీఆర్ మునుగోడు బయలుదేరారు. టీఆర్ఎస్ ప్రజా దీవెన సభకు లక్షన్నర మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అమిత్షా సభకు ముందు రోజు కావడంతో.. ఈ సభను టీఆర్ఎస్ ఛాలెంజ్గా నిర్వహిస్తోంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు మండలాల నుంచి భారీ ఎత్తున జనాలను తరలిస్తోంది.
ట్రాఫిక్ ఆంక్షలు..
టీఆర్ఎస్ సభ నేపథ్యంలో మునుగోడులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. హైవే రూట్లో వచ్చేవారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.
మునుగోడు బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం కేసీఆర్..
ఓటు వేసే ముందు ప్రతీ రైతు బోరు దగ్గర దండం పెట్టి ఓటేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే, ఆడబిడ్డలు గ్యాస్ సిలిండర్కు దండం పెట్టుకోవాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. సంక్షేమం కోసం పాటు పడేవారికి కాకుండా, పోటు వేసే వారికి ఓటు వేస్తే అథోగతి పాలవుతామని అలర్ట్ చేశారు.
కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే కుదరదని మునుగోడు ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మనల్ని మనమే కాపాడుకోవాలని అన్నారు. చేనేత కార్మికులపై కూడా జీఎస్టీ విధించారని కేంద్రం విధానాలనూ తూర్పారబట్టారు. పిల్లలు తాగే పాలమీద జీఎస్టీ వేయడంతో పాటు.. చస్తే కూడా జీఎస్టీ వేస్తున్నారని ధ్వజమెత్తారు కేసీఆర్. ఎన్పీఏల పేరుతో బడాబాబులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్కు ఓటేస్తే కనగల్ వాగులో వేసినట్లేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది వృధా అవుతుందన్నారు. టీఆర్ఎస్ ఇప్పటికే బలంగా ఉందన్నారు. దేశమంతా మునుగోడు వైపే చూస్తోందన్నారు. మరో సభ త్వరలోనే చండూరులో ఉంటుందని ప్రకటించారు సీఎం కేసీఆర్.
మునుగోడు దెబ్బ కొడితే బీజేపీ నషాళానికి అంటాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీజేపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ బంద్ అవుతాయని చెప్పారు సీఎం కేసీఆర్. పెన్షన్ 2000 ఉండాలా? 600 ఉండాలా? అని మునుగోడు ప్రజానీకాన్ని అడిగారు కేసీఆర్. ఆరు వందలు ఇచ్చే బీజేపీకి ఓటేద్దామా? రెండు వేలు వచ్చే టీఆర్ఎస్ను ఆదరిస్తారా? ఆలోచించుకోవాలని సూచించారు.
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీపై పోరాటానికి మునుగోడులో ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇది పార్టీల ఎన్నిక కాదని, రైతుల బతుకుదెరువు ఎన్నిక అని పిలుపునిచ్చారు. ఇది తెలంగాణ జీవితం అని, పోగొట్టుకోవద్దని హితవుచెప్పారు సీఎం కేసీఆర్.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ విసిరారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఏంటో చెప్పాలని సవాల్ విసిరారు. మునుగోడు వస్తున్నావు కదా.. ముందు ఆ సంగతి తేల్చండి అంటూ నిలదీశారు.
బీజేపీకి ఓటు పడితే బావి దగ్గర మీటరు పడతాయి. మూడు తోకలున్న వాడు 110 మందిని పడగొట్టి పైకి వస్తాడట. ఈడీ వస్తే నా దగ్గర చాయ్ తాగించి పంపుతా. దొంగలు బయపడతారు. ఈడీ కాకపోతే బోడి కూడా పంపించు.. నాకేంటి. ఇది దేశం, రాచరిక వ్యవస్థ కాదు. ప్రజలను బెదిరిస్తామంటే సహించే ప్రసక్తే లేదు. నీ అహంకారమే నీకు శత్రువు అవుతుంది మోదీ. రైతు వ్యతిరేక విధానమే నిన్ను పడగొడుతుంది.
మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు.. మన బతుకు దెరువు ఉపఎన్నిక. వడ్లు కొనమంటే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశాం. మీ రాష్ట్రంలో 2 వేల పెన్షన్లు ఎందుకు ఇస్తున్నారని కేంద్రం ప్రశ్నిస్తోంది. పేదల నోళ్లు కొట్టి బడా షావుకార్లకు ఇవ్వాలన్నది బీజేపీ ఆలోచన. రైతు బీమాతో చనిపోయిన రైతు కుటుంబానికి డబ్బు అందుతోంది. రైతుబీమా వంటి పథకం దేశంలో ఎక్కడైనా ఉందా? ఇలాంటి పథకాలు బంద్ చేయాలని కేంద్రం చెబుతోంది.
మోదీ దోస్తులు సూట్కేసులు పట్టుకుని రెడీగా ఉన్నారు. కార్పొరేట్ వ్యవసాయం చేద్దామనే కుట్ర జరుగుతోంది. బీజేపీ పాలనలో ఒక్క మంచి పని అయినా జరిగిందా? రాష్ట్రపతి ఎన్నికలప్పుడు 20 ప్రశ్నలు అడిగాను, దేనికీ సమాధనం చెప్పలేదు. ఎయిర్పోర్టుల, విమానాలు, రైళ్లు, రోడ్లు అమ్ముతున్నారు. మిగిలింది ఇక రైతులు, రైతుల భూములు, పంటలు. మన నోట్లో మట్టి పోసే పని జరుగుతోంది. బావుల వద్ద మీటర్లు పెట్టాలని కేంద్రం అంటోంది. నేను చచ్చినా మీటర్లు పెట్టనని తెగేసి చెప్పిన. బీజేపీ లక్ష్యం ఎరువుల ధరలు పెంచాలి, కరెంట్ రేటు పెంచాలి, పండి పంటకు ధర ఇవ్వకూడదు. మరి వ్యవసాయ భూములకు మీటర్లు పెట్టే బీజేపీ కావాలా? మీటర్లు వద్దన్న కేసీఆర్ కావాలా? మునుగోడు ప్రజలు నిర్ణయించుకోవాలి.
చేతిలో ఉన్న అధికారాన్ని ఎవరికో అప్పగించకూడదని మునుగోడు ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజల చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు అని, దానిని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నిక ఎవరిని ఉద్ధరించేందుకు? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న మాయామశ్చీంద్ర ఏంటి? అని ప్రశ్నించారు.
మునుగోడు ప్రజా దీవెన సభకు హాజరైన సీఎం కేసీఆర్.. జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఫ్లోరైడ్ సమస్యను గతంలో పాలకులు ఎవరూ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఉద్యమం చేపట్టిన తరువాత సమస్యను అనేకసార్లు ప్రస్తావించానన్నారు. నల్లగొండ నగరా పేరుతో 15 రోజుల నాడు జిల్లా మొత్తం తిరిగానని ఉద్యమ సమయం నాటి విషయాలను ప్రస్తావించారు కేసీఆర్. శివన్నగూడెం గ్రామంలో నిద్రించానని చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ మద్ధతు ప్రకటించింది. మునుగోడులో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రజా వేదిక సాక్షిగా ఆ పార్టీ అధికార ప్రతినిధి పల్లా వెంకట్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు.
మునుగోడు ప్రజాదీవెన సభాప్రాంగణానికి పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చారు. మధ్యాహ్నం నుంచి సభా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సభలోనే మునుగోడు అభ్యర్థి పేరును సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు.
ప్రజాదీవెన సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ మునుగోడు చేరుకున్నారు. ప్రగతి భవన్ నుంచి బస్సులో బయలుదేరిన సీఎం కేసీఆర్.. మునుగోడుకు చేరుకున్నారు. ఆయన వెంట వందల సంఖ్యలో కార్లు వెళ్లాయి. సీఎం ప్రయాణిస్తున్న బస్సును అనుసరిస్తూ దాదాపు ఆరు కిలోమీటర్ల మేర కార్లు బారులు దీరాయి. దారిపొడవునా సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం చెప్పారు.
సీఎం కేసీఆర్ మునుగోడు సభకు రోడ్డు మార్గంలో బయలుదేరారు. భారీ వాహన శ్రేణితో ర్యాలీగా బయలుదేరారు గులాబీ దళపతి. ప్రస్తుతం నారాయణ్పూర్ వద్దకు చేరుకుంది సీఎం కాన్వాయ్. కాసేపట్లో మనుగోడుకు చేరుకున్నారు ముఖ్యమంత్రి. కాగా, ప్రజా దీవెన సభకు టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు భారీగా చేరుకున్నారు.