Nagarjuna Sagar By-Election 2021: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం నాడు నల్లగొండ జిల్లా హాలియాలో పర్యటించనున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇవాళ హాలియాలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ హాజరయ్యే ఈ బహిరంగ సభ కోసం భారీగా జన సమీకరణ చేయాలని టీఆర్ఎస్ ప్లాన్ వేస్తోంది. సీఎం కేసీఆర్ బహిరంగ సభను సక్సెస్ చేయాలని పార్టీ ముఖ్య నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభ ఏర్పాట్లు పూర్తి చేసిన టీఆర్ఎస్.. జన సమీకరణపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలను బహిరంగ సభకు చేర్చాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలాఉంటే.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. 17వ తేదీన పోలింగ్ ఉండగా.. 15వ తేదీ సాయంత్రానికి ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియాలో భారీ బహిరంగ సభకు ప్లాన్ వేశారు.
ఇదిలాఉంటే.. హాలియా మండలంలోని అనుముల గ్రామంలో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను అడ్డుకోవాలని కోరుతూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, దీనిపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయన్న పటిషనర్.. ఏ ఒక్క పార్టీని ప్రతివాదిగా చేర్చక పోవడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పు పట్టింది. ఉల్లంఘనలకు ఆధారాలు చూపకుండా కోర్టును ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే బహిరంగ సభకు సంబంధించి దాఖలైన పిటిషన్ హైకోర్టు తోసిపుచ్చింది.
హైకోర్టులో టీఆర్ఎస్ బహిరంగ సభకు లైన్ క్లియర్ కావడంతో ఇవాళ యధావిధిగా సీఎం కేసీఆర్ ఎన్నికల సభ జరగనుంది. సాయంత్రం సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ప్రాంగాణానికి చేరుకుంటారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. కాగా నాగార్జున సాగర్ ఉపఎన్నిక బరిలో మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ యాదవ్ ఉన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాగార్జునసాగర్లో భగత్ గెలుపు కోసం టీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
Also read:
Health Benefits of Cloves: లవంగాలు తింటే.. ఈ అనారోగ్య సమస్యలన్నీ మటుమాయమే.. అవేంటంటే..?