
చెన్నూరు, జూన్ 9: మంచిర్యాల జిల్లా చెన్నూరులో సంచలనం సృష్టించిన ఎస్బీఐ 2 బ్యాంక్ అంతర్గత బంగారం చోరీ కేసు సుఖాంతమైంది. తొమ్మిది నెలల క్రితం జరిగిన ఈ ఘటనలో చోరీకి గురైన బంగారాన్ని పోలీసులు పూర్తి స్థాయిలో రికవరీ చేసి ఖాతాదారులకు అందజేశారు. అటు బ్యాంక్ యాజమాన్యం సైతం షరతులతో కూడిన నిబందనలతో తొమ్మిది నెలల వడ్డీని మాఫీ చేసి ఖాతాదారులకు బంగారాన్ని అప్పగించింది. తొమ్మిది నెలల నిరీక్షణకు ఎట్టకేలకు ఫలితం దక్కడం తో బ్యాంకులోనే స్వీట్లు తినిపించుకుని హర్షం వ్యక్తం చేశారు ఖాతదారులు.
తొమ్మిది నెలల క్రితం జరిగిన అంతర్గత బంగారం చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తమ కష్టార్జితంతో కొనుక్కుని ఆర్థిక అవసరాలకు తనాఖా పెట్టిన బంగారం మాయం కావడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దాదాపు 400 మందికి పైగా బాదితుల బంగారం క్యాషియర్ మాయం చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నెల రోజుల వ్యవధిలోనే మాయమైన బంగారాన్ని రికవరీ చేశారు. అయితే బ్యాంకు కొర్రీలు పెట్టడం తో తొమ్మిది నెలలుగా తమ బంగారం కోసం నిరసనలు, ఆందోళనలు , ధర్నాలు చేపట్టారు బాదితులు. అయితే ఈ క్లిష్ట సమయంలో ఎస్బీఐ సంస్థ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించింది. ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడుతూ వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా భారీ ఊరటనిచ్చింది.
బాదితులకు చెందాల్సిన బంగారాన్ని తిరిగి ఇస్తూనే తొమ్మిది నెలల వడ్డీని మాఫీ చేసింది. దాదాపు 300 మందికై పైగా బంగారాన్ని బాదితులకు అందజేసింది. చోరీకి గురైన బంగారం సురక్షితంగా తిరిగి లభించడమే కాకుండా బ్యాంక్ యాజమాన్యం వడ్డీని కూడా పూర్తిగా మాఫీ చేయడంతో ఖాతాదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఖాతాదారులు బ్యాంకు వద్ద స్వీట్లు పంపిణీ చేసుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.